Tuesday, January 29, 2013

సమయస్ఫూర్తి

              ఒక రాజ్యంలో ఒక ముని ఉండేవాడు. అతడు సర్వజ్ఞాని. జోతిష్యం కూడా బాగా చెప్పేవాడు. అతను చెప్పినవన్నీ నిజం అవుతుండడంతో ఆ రాజ్యంలోని వారందరికీ అతనిపై నమ్మకం కుదిరింది.

అతని ప్రతిభ ఆ నోట ఈ నోట ఆ దేశపు రాజు వరకు పాకింది. ఆ ముని ప్రతిభ ఏమిటో స్వయంగా తెలుసుకుందామనిపించింది రాజుకు. అంతే! వెంటనే తన సైనికులను పంపించి,
ఆ ముని ఎక్కడ ఉన్నా వెదికి తన ముందు ప్రవేశపెట్టమన్నాడు.

రాజాజ్ఞ ప్రకారం బయలుదేరి, ఊళ్లన్నీ వెతుకుతూపోయారు. చిట్టచివరకు ఒకానొక ఊరిలో ముని దొరికాడు. అతనికి రాజాజ్ఞను తెలిపి, తమతో రమ్మన్నారు సైనికులు.

ముందు తటపటాయించినా, రాజాజ్ఞ మీరకూడదని సైనికుల వెంట రాజు దగ్గరికి పయనమయ్యాడు ఆ ముని. రాజు మునిని సగౌరవంగా ఆహ్వానించి, సకల మర్యాదలు చేశాడు. అన్నీ పూర్తయ్యాక,
రాజు ‘‘మునివర్యా! మీ జ్యోతిష్య ప్రతిభ గురించి చాలా విన్నాం. ఇప్పుడు మా భవిష్యత్తు చెప్పాలి’’ అన్నాడు.

ముని ఒక్కక్షణం ఆలోచించి, రాజుగారి భవిష్యత్తు చెప్పడం ప్రారంభించాడు. తన గురించి గొప్పగా చెబుతుంటే రాజు పొంగిపోయి కానుకల మీద కానుకలు కురిపించాడు. కొంతసేపటికి ముని రాజుకు జరగబోయే చెడు చెప్పడం మొదలుపెట్టాడు.

వెంటనే రాజుకు కోపం వచ్చింది, ఆ మునికి ఉరిశిక్ష వేయాలన్నంత ఆవేశం వచ్చింది. ‘తన భవిష్యత్తు ఇంత భయంకరంగా చెబుతాడా?’ అనుకుని, ‘‘నువ్వు తప్పుడు జ్యోతిష్యం చెబుతున్నావు. నీకు నిజంగా జ్యోతిష్యం వస్తే నువ్వెప్పుడు చనిపోతావో చెప్పు’’ అని అడిగాడు.
మునికి రాజు కోపం అర్థమైంది. తనకు రాబోయే అపాయాన్ని కూడా ఊహించాడు. సమయస్ఫూర్తితో నెమ్మదిగా ‘‘మీరు చనిపోయే గంట ముందు నేను చనిపోతాను ప్రభూ’’ అన్నాడు.
ఆ మాటతో రాజుకి కోపం చల్లారిపోయింది. తన తప్పును తెలుసుకుని మునిని గౌరవించి సాగనంపాడు.

0 comments:

Post a Comment