Monday, January 28, 2013

ప్రో-బయాటిక్స్ మజ్జిగే మందుగా...

మజ్జిగే మందెలా అవుతుంది?

మన జీర్ణవ్యవస్థ పొడవునా అనేక కోట్ల సూక్ష్మజీవులు నివాసం ఉంటుంటాయి. అవి కొన్ని కొన్ని వ్యాధులనుంచి మనల్ని రక్షిస్తుంటాయి. అంటే... పరోక్షంగా అవి మన రోగనిరోధకశక్తిని పెంపొంది స్తుంటాయి. అందుకే వాటిని ‘ప్రో-బయోటిక్’ అంటారు. మన సంప్రదాయంలో మనకు తెలియకుండానే మనం ప్రో-బయాటిక్స్‌ను తీసుకుంటూ ఉంటాం. ఉదాహరణకు ఇడ్లీ పిండిని రాత్రి కలుపుకుని ఆ మర్నాడు ఇడ్లీ చేసుకుంటాం. అలాగే దోసె పిండి కలుపుకుని కాస్తంత పులిసిపోయాకే అట్లు వేసుకుంటాం. ఎండన పడి వచ్చిన వారికి మజ్జిగ ఇస్తాం. ఇలా మనం మజ్జిగను తాగినప్పుడు కూడా మనకు మేలు చేసే అనేక సూక్ష్మజీవులను మన కడుపులోకి తీసుకుని, ఆరోగ్యాన్ని పెంచుకుంటాం. అంటే మజ్జిగరూపంలో మనం ఒకవైపు ఎండ దెబ్బ వల్ల వచ్చే డీ-హైడ్రేషన్‌ను నిరోధించుకుని, మరోవైపు పేగులకు మేలు చేసే సూక్ష్మజీవులనూ సమకూర్చుకుంటామన్నమాట. ఇలా మనం మన సంస్కృతి సంప్రదాయాల్లో ‘ప్రో-బయాటిక్స్’ను తీసుకునే అలవాటు ఎప్పట్నుంచో మనకు ఉంది. మనం మజ్జిగలా తీసుకునేదాన్నే ఇప్పుడు చాలామంది మందులా కూడా ఉపయోగిస్తున్నారు.

ఏయే జబ్బులకు...

పైన పేర్కొన్నట్లుగా రుక్మిణికి కలిగిన సమస్య చాలామందిలో కనిపిస్తుంటుంది. దీన్ని వైద్యపరిభాషలో ‘ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్’ అంటారు. ఇదిగాక అల్సరేటివ్ కొలైటిస్ అనే వ్యాధిలోనూ, క్రోన్స్ డిసీజ్‌లోనూ ఇలాంటి లక్షణాలే కనిపిస్తుంటాయి. అల్సరేటివ్ కొలైటిస్‌లో పెద్దపేగు, రెక్టమ్ (మలద్వారం పై భాగం) వాపు, నొప్పి, మంట (ఇన్‌ఫ్లమేషన్)కు గురవుతాయి. ఇక క్రోన్స్ డిసీజ్ ఉన్నవారిలోనైతే జీర్ణవ్యవస్థ ఏ భాగంలోనైనా ఇన్‌ఫ్లమేషన్ కనిపిస్తుంది. ఈ రెండు వ్యాధులను కలిపి ‘ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్’గా వ్యవహరిస్తుంటారు.

ఎందుకొస్తాయి ఈ సమస్యలు...?

ఇరిటబుల్ బవెల్ డిసీజ్‌లు ఎందుకు వస్తాయన్న అంశంపై ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టతా లేదు. కొంతమంది అయితే ఇవి మానసిక సమస్యల వల్ల కనిపించే శారీరక లక్షణాలని సిద్ధాంతీకరించారు. తీవ్రమైన ఒత్తిడితో పనిచేసే వారికి ఈ జబ్బులు వస్తుండటం గమనించారు.

తగ్గడానికి ఏం చేయాలి...?

ఉదయం తినే టిఫిన్లలో పాశ్చాత్య తరహా ఆహారాలు కాకుండా మన సంప్రదాయ వంటకాలైన ఇడ్లీ, దోసె వంటివాటిని తీసుకోవాలి. తరచూ తాజా మజ్జిగ తాగుతూ ఉండాలి. కాస్తంత పులిశాక తాగితే అందులో సూక్ష్మజీవులు పెరగవచ్చేమోగాని... అప్పటికే తాజా మజ్జిగ తన క్షారగుణాన్ని కోల్పోయి ఆమ్ల గుణాన్ని సంతరించుకుంటుంది. అప్పటికే మన జీర్ణవ్యవస్థలో అసిడిటీ ఉంటే... ఆ యాసిడ్‌కు... ఈ ఎసిడిక్ మజ్జిగ తోడై సమస్యను పెంచుతుంది. అందుకే తాజా మజ్జిగ తాగాలి. లేదా తియ్యటి పెరుగులోనూ ప్రో-బయాటిక్స్ ఎక్కువగానే ఉంటాయి. ఆహారంలో భాగంగా తీసుకునే రిఫైన్‌డ్ షుగర్స్, జంక్‌ఫుడ్‌ను పూర్తిగా మానేయాలి. వీలుకాకపోతే గణనీయంగానైనా తగ్గించాలి. ఇక కార్బోహైడ్రేట్స్ కోసం పొట్టుతో ఉండే అన్ని ధాన్యాలనూ తీసుకోవచ్చు కానీ కొంతకాలం పాటు మొక్కజొన్న, గోధుమలనుంచి మాత్రం దూరంగా ఉండాలి. తాజా పండ్లు, ఆకుపచ్చటి ఆకుకూరలతో మన పేగుల్లోకి పుష్కలంగా పీచు వెళ్లేలా చేసుకోవాలి. అప్పటికీ గుణం కనిపించకపోతే డాక్టర్‌లను అడిగి ఇప్పుడు టాబ్లెట్లు, కాప్సూల్స్, పౌడర్లు, సోయాబీవరేజెస్ రూపంలో లభ్యమవుతున్న ప్రోబయాటిక్స్ మందులు వాడాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఒత్తిడి తగ్గించుకోవాలి.

0 comments:

Post a Comment