Showing posts with label Raagams. Show all posts
Showing posts with label Raagams. Show all posts

Tuesday, February 26, 2013

చక్రవాకం, మలయమారుతం, కళావతి

చక్రవాకం, మలయమారుతం, కళావతి రాగాల ఆధారంగా ఉన్న కొన్ని పాటలు

చక్రవాకం
1. ఏడు కొండలవాడ వెంకటా రమణా… (పెళ్ళిచేసి చూడు)
2. విధివంచితులై విభవము వీడి… (పాండవ వనవాసం)
3. చీకటిలో కారుచీకటిలో… (మనుషులు మారాలి)
4. రాధకు నీవేర ప్రాణం… (తులాభారం)
5. వీణలోనా తీగలోనా… (చక్రవాకం)
6. జగమే రామమయం… (కధానాయకి మొల్ల)
7. నీ కొండకు నీవే రప్పించుకో… (ఘంటసాల ప్రైవేట్‌ రికార్డ్‌)
8. పిబరే రామరసం… (బాలమురళి ప్రవేట్‌ రికార్డ్‌)
9. పిలిచే వారుంటే … (కల్యాణ మండపం)
10. స్వరములు ఏడైన… (రాగమాలికలోని ఒకచరణం)
11. పూఛొన కైసె మైనె రైన్‌బితాయె… (మేరీ సూరత్‌ తేరీ ఆంఖే)


మలయమారుతం
12. ఓ మలయ పవనమా… (మానవతి)
13. కొండగాలి తిరిగింది… (ఉయ్యాల జంపాల)
14. మనసా ఎటులోర్తునే… (త్యాగరాజ కృతి)
15. మేలుకో శ్రీరంగా… (విప్రనారాయణ రాగమాలికలోని ఒక చరణం)


కళావతి
16. కరుణామయా దేవా… (భక్త తుకారాం)
17. మా ఇలవేలుపు నీవేనయ్యా… (మా వదిన)
18. తోటలోకి రాకురా తుంటరి తుమ్మెదా… (బుద్ధిమంతుడు)
19. వెన్నెల రేయి ఎంతో చలీ చలీ… (ప్రేమించిచూడు)
20. వసంతగాలికి… (కర్ణ?)


రాగం “చక్రవాకం”, కర్ణాటక సాంప్రదాయ సంగీతంలోని 16వ మేళకర్త. హిందూస్తానీ సంగీతంలో “చక్రవాకం”రాగానికి దగ్గర రాగం “అహిర్‌ భైరవి”. కరుణ, భక్తి రసాలను ఈ రాగాలు బాగా పోషిస్తాయి. ముఖ్యంగా, పైన చెప్పిన సినిమా పాటలు పరిచయం ఉన్న వారికి ఈ విషయం అనుభవమే! “చక్రవాకం”, “అహిర్‌ భైరవి” రాగాల స్వర స్థానాల గురించి, “మలయ మారుతం”, “కళావతి” రాగాల స్వరస్థానాలు చర్చించినపుడు తెలుసుకుందాం!

“మలయ మారుతం” కర్ణాటక సాంప్రదాయ సంగీతంలోని 16వ మేళ కర్త అయిన “చక్రవాకం” రాగం యొక్క జన్యం. హిందుస్తానీ పద్ధతిలో “మలయ మారుతం” అన్న పేరుగల రాగం కానీ, “మలయ మారుతం” రాగాన్ని పోలిన రాగం కానీ లేవు. ఐతే, ముఖ్యంగా వాయిద్యకారులు గత 50, 60 సంవత్సరాలుగా, “మలయ మారుతం” రాగాన్ని యధాతధంగా హిందూస్తానీ పద్ధతిలోకి ప్రవేశపెట్టారు. “మలయ మారుతం” ఉదయాన్నే పాడుకొనే ఆహ్లాదకరమైన రాగం. కర్ణాటక సాంప్రదాయ సంగీతంలోని “మనసా ఎటులోర్తునే..” అన్న చాలా ప్రసిద్ధ త్యాగరాజ కృతి, స్వరపరచబడింది “మలయ మారుతం” రాగంలోనే!కరుణ రసాన్ని ఎంతో చక్కగా పోషించే “మలయ మారుతం” రాగం మనో ధర్మ సంగీత అంశాలైన రాగాలాపన, స్వరకల్పన లకు ప్రసిద్ధమైంది.

కళావతి” రాగం హిందూస్తానీ సాంప్రదాయానికి సంబంధించింది. కర్ణాటక సాంప్రదాయ సంగీతంలో “కళావతి” అన్న రాగం ఉన్నా, ఈ రెంటికీ పోలికలు లేవు. పైన చెప్పుకున్న 16వ మేళకర్త “చక్రవాకం” యొక్క జన్య రాగం అయిన “వలజి” అన్న రాగం హిందూస్తానీ సంగీతంలోని “కళావతి”ని కొంతవరకు పోలి ఉంటుంది. ఈ రెంటికీ స్వరస్థానాలు ఒకటే. అయితే, ఈ రెండు రాగాలు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయని చెప్పలేము. “కళావతి” రాగాన్ని అర్ధరాత్రికి ముందు సమయంలో పాడతారు. పైన ఇచ్చిన కొన్ని సినిమా పాటలలో, ఈ రాగాన్ని అందుకనే వాడారు. ఉదాహరణకు, “వెన్నెల రేయి ఎంతో చలీ చలీ…”, “వసంత గాలికి వలపులు రేగ…” వంటి పాటల్లో, సాహిత్యానికి తగ్గట్టే “కళావతి” రాగం వాడారు.

స్వరస్థానాలు పరిచయం
“చక్రవాకం” సంపూర్ణ రాగం. ఆరోహణలోనూ అవరోహణలోనూ ఏడు స్వరాలు ఉపయోగించే రాగం. కీబోర్డ్‌ మీద పలికిస్తే, స్వర స్థానాలు ఈ విధంగా ఉంటాయి.
స రి1 X X గ2 మ1 X ప X ద2 ని1 X స
ఆరోహణ సరిగమపదనిసా
అవరోహణ సానిదపమగరిస
X అన్న చోట ఉన్న స్వరాలను వాడరు.
హిందూస్తానీ సంగీతంలోని “అహిర్‌ భైరవి” రాగం, మన “చక్రవాకం” రాగాన్ని పోలి ఉంటుంది. అరోహణ అవరోహణ స్వరాలు కూడా “చక్రవాకం” రాగం లాగే ఉంటాయి. ఐతే, రాగం యొక్క ఆలాపనలోనూ, రాగానికి ఇచ్చే ట్రీట్‌మెంట్‌ లోనూ కర్ణాటక హిందూస్తానీ సంగీతాల్లో ఉన్న తేడా ఎలా ఉంటుందో, “చక్రవాకం”, “అహిర్‌ భైరవి” రాగాల్లో స్పష్టంగా కనపడుతుంది.

“మలయ మారుతం” షౌడవ రాగం. ఆరోహణ అవరోహణ, రెంటిలోనూ ఆరు స్వరాలు మాత్రమే ఉంటాయి. “చక్రవాకం” రాగంలోని మధ్యమ స్వరాన్ని (”మ”) పూర్తిగా వదిలేస్తే, అది “మలయ మారుతం” అవుతుంది. కీబోర్డ్‌ మీద స్వర స్థానాలు ఇలా ఉంటాయి.
స రి1 X X గ2 X X ప X ద2 ని1 X స
ఆరోహణ సరిగపదనిసా
అవరోహణ సానిదపగరిస
X అన్న చోట ఉన్న స్వరాలను వాడరు.
“గ, ని” స్వరాలను “ఛాయా స్వరాలు” అంటారు. రాగ లక్షణాన్ని చూపిస్తున్నప్పుడు, “ధ” స్వరం మీద ఎక్కువగా ఆపుతూ ఉంటారు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు, “మలయ మారుతం” రాగాన్ని పోలిన హిందూస్తానీ రాగం లేదు.

“కళావతి” ఔడవ రాగం. ఆరోహణ అవరోహణ, రెంటిలోనూ ఐదు స్వరాలు మాత్రమే ఉంటాయి. “మలయ మారుతం” రాగంలోని రిషభం స్వరాన్ని (”రి”) పూర్తిగా వదిలేస్తే, అది “కళావతి” రాగం అవుతుంది. కీబోర్డ్‌ మీద స్వర స్థానాలు ఇలా ఉంటాయి.
స X X X గ2 X X ప X ద2 ని1 X స
ఆరోహణ సగపదనిసా
అవరోహణ సానిదపగస
X అన్న చోట ఉన్న స్వరాలను వాడరు.

“మలయ మారుతం” రాగంలోని రిషభాన్ని తియ్యటం వల్ల ఐదు స్వరాలే ఉన్నా, ఈ రాగానికి తనదైన ఒక ప్రత్యేకత ఉంది. లలిత సంగీతంలో “కళావతి” రాగాన్ని వాడటం గత 50, 60 సంవత్సరాలుగా జరుగుతోంది.

సినిమా పాటల్లోకి దూకే ముందు, ఈ మూడు రాగాలకి ఉన్న సంబంధాలని చూద్దాం! స్వరస్థానాల దృష్య్టా చెప్పాలంటే, “మలయమారుతం” రాగం “చక్రవాకం” రాగంలో ఒక భాగం. అలాగే, “కళావతి” రాగం “మలయ మారుతం” రాగంలో ఒక భాగం అనుకోవచ్చు. అక్కడితో ఈ పోలికలు, సంబంధాలు పూర్తి అయినట్లే! రాగ లక్షణం దృష్య్టా, ఈ మూడు రాగాలకి దేని గొప్పతనం, ప్రత్యేకత దానికే ఉన్నాయి.

సినిమా పాటలు
“చక్రవాకం” రాగానికి సినిమా పాటల్లో ఒక మంచి ఉదాహరణ “పెళ్ళిచేసి చూడు” సినిమాలోని “ఏడుకొండలవాడ వెంకటా రమణా..” అన్న పాట. జంపె తాళంలో నడిచే ఈ పాట కంపోజ్‌ చెయ్యటంలో ఘంటసాల, పాడటం లో శ్రీమతి లీల చూపించిన విద్వత్తు వాళ్ళు సినీ సంగీతంలో ఎలా ఉన్నత స్థానాల్ని సంపాదించుకున్నారో నిరూపిస్తాయి. పైన చెప్పిన ఇతర సినిమా పాటల్లో ఎక్కువగా”అహిర్‌ భైరవి” రాగం ఛాయలు కనిపిస్తాయి. ఉదాహరణకి, “రాధకు నీవేర ప్రాణం…” అన్న పాప్యులర్‌ పాటలో, శ్రీమతి సుశీల పాట ముందు ఆలాపన ద్వారా “అహిర్‌ భైరవి” ఛాయలు మనకి చూపించారు. అలాగే “తేరీ సూరత్‌ మేరీ ఆంఖే” అన్న హిందీ సినిమాలో “పూఛోన కైసే మైనే…” అన్న పాట సినిమాలో రెండు, మూడు చోట్ల కరుణ రసాన్ని పోషిస్తూ వినిపిస్తుంది. ఉత్సాహం ఉన్న వాళ్ళు, ఈ సినిమా మళ్ళీ చూసినపుడు, మన్నాడే పాడిన ఆలాపన, స్వరోచ్ఛారణ బాగా గుర్తు పెట్టుకో తగ్గవి.

ఇంకో ఉదాహరణ. “స్వరములు ఏడైనా రాగాలెన్నో….” అన్న శ్రీమతి సుశీల పాడిన రాగమాలిక (పంతువరాళి, చక్రవాకం, హిందోళం, సింధుభైరవి) లో, “జననంలోనా కలదు వేదనా, మరణంలోనా కలదు వేదనా” అని మొదలయ్యే చరణంలోని సాహిత్యానికి, సంగీతం ఇచ్చింది “చక్రవాకం” రాగంలోనే!

“లలిత సంగీతంలో కూడా మలయమారుతం వంటి రాగాలను వాడచ్చు” అని ప్రముఖ వాగ్గేయకారుడు శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు (”రజని”), “ఓ మలయ పవనమా…” అన్న పాట ద్వారా “మానవతి” అన్న పాత సినిమాలో నిరూపిస్తే, “ఉయ్యాల జంపాల” సినిమా ద్వారా, “కొండగాలి తిరిగింది…” అన్న పాటని “మలయ మారుతం” రాగంలో కంపోజ్‌ చేసి, ప్రతి తెలుగు వ్యక్తి నాలుకపైన పలికేట్లు చేసిన నేర్పు, గొప్పతనం, స్వర్గీయ పెండ్యాల నాగేశ్వరరావు గారివి. ఇప్పుడు చెప్పుకున్న ఉదాహరణల్లో, సాహిత్య పరంగా “మలయ పవనము”, “కొండగాలి” వంటి పదాలతో మొదలయ్యే పాటలకి “మలయ మారుతం” రాగాన్ని వాడటం ఎంత సహజంగా ఉందో మీరు గమనించే ఉంటారు. పైన లిస్ట్‌ చూస్తే, “మలయ మారుతం” రాగం, తెలుగు సినిమా పాటల్లో తక్కువే అనిపిస్తుంది అడపా, తడపా రాగమాలికల్లో ఈ రాగాన్ని వాడుకున్నా!

మాష్టర్‌ వేణు కంపోజ్‌చెయ్యగా, ప్రముఖ సినీ గాయకుడు శ్రీ పి. బి. శ్రీనివాస్‌ , సుశీలతో కలిసి పాడిన యుగళ గీతం “వెన్నెల రేయి ఎంతో చలీ చలీ..” పాట చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఈ పాటలో “కళావతి” రాగంలో వాడకూడని “తీవ్ర రిషభం” వాడటం జరిగింది. సినిమా పాటల్లో ఇది మామూలే! ముఖ్యంగా గుర్తు పెట్టుకోవల్సింది పి. బి. శ్రీనివాస్‌ “చూపులతోనే మురిపించేవూ… మాటలతోనే మరపించేవూ…” అన్నప్పుడు ఈ పదాల చివర వచ్చే గమకాలు అద్భుతంగా పాడటం. లలిత సంగీతంలో వచ్చే ఒకచిక్కు ఏమిటంటే, శాస్త్రీయ సంగీతంలో అన్నట్టుగానే స్వరాలన్నీ పలకాలి, అంతే కాకుండా ఆ స్వరాలన్నిటిని లలితంగా కూడా పాడాలి! శ్రీ శ్రీనివాస్‌ ఈ పాటలో అది స్పష్టంగా వినిపించారు. ప్రముఖ సంగీత దర్శకుడు, శ్రీ కె.వి. మహాదేవన్‌ ట్యూన్‌ చేసిన “తోటలోకి రాకురా తుంటరి తుమ్మెదా..” అన్న “బుద్ధిమంతుడు” సినిమాలోని పాట కూడా “కళావతి” రాగంలో బాణీ కట్టిందే! కానీ, ఈ పాటలో “కోమల మధ్యమం”, “తీవ్ర రిషభం” కూడా వాడారు. అందువల్ల పాటకు ఏమీ నష్టం కలగలా! ఒక రకంగా చూస్తే ఈ పాటలో వాడిన రాగాన్ని “మిశ్ర కళావతి” అనొచ్చు.
ప్రతి వ్యాసం చివర, ఆ వ్యాసంలో పరిచయం చెయ్యబడ్డ రాగంకి సంబంధించిన సినిమా పాటల పూర్తి స్వరాలు ఇస్తున్నట్టే, ఈ వ్యాసంలో కూడా ఇస్తున్నాను. “చక్రవాకం” కోసం “ఏడుకొండలవాడ వెంకటా రమణా…”, “మలయ మారుతం” కోసం “కొండగాలి తిరిగింది…”, “కళావతి” కోసం “వసంతగాలికి” అన్న పాటల స్వరాలు ఇస్తున్నాను. స్వరాలను అర్ధం చేసుకోటానికి కొత్తగా ప్రయత్నించే వారు, ఈ పాటలు ఒరిజినల్‌ రికార్డ్‌ మళ్ళీ వింటే, ఈ స్వరాలు కొంచెం తేలికగా అర్ధమవుతాయి.

“ఏడుకొండలవాడ …” స్వరాలు
Opening సా, రిగమ, సా, నిదని, సా, రిగమ, పా, దనిస, దా,
దని, సరిగ, సా, నిసనిప, దానిసా, దనిదమ, పాదానీ
పదనీ, దపమగరీ, గామా, పా, గరిసా

ఏడుకొండలవాడ వెంకటారమణా
సద్దుసేయక నీవు నిదురపోవయ్యా

గమపా, రిగమారి, సా, రిగపమా

మొదటి చరణం
పాలసంద్రపుటలలు పట్టెమంచముగా
పున్నమి వెన్నెలలు పూలపానుపుగా
కనులనొలికే వలపు పన్నీటి జల్లుగా
అన్ని అమరించె నీ అలిమేలుమంగా… “ఏడు కొండలవాడ”

గమపా, రిగమారి, సా, రిగమ, పా, దనిస, దా
దని, సరిగ, సా, నిసనిప, దానిసా, దనిదమ, పాదానీ
పదనీ, దపమగరీ, గామా, పా, గరిసా


రెండవ చరణం
నాపాలి దైవమని నమ్ముకున్నానయ్య
నా భాగ్యదేవతా నను మరువకయ్యా
బీబి నాంచారమ్మ పొంచి ఉన్నాదయ్య
చాటు చేసుకు ఎటులో చెంతజేరెదనయ్య… “ఏడు కొండలవాడ”



“కొండగాలి తిరిగింది …” స్వరాలు
కొండగాలి తిరిగిందీ…. సాని ద పదపదసా
కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది
గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది ఆ … పదగరిసా ..
సారిగపా..

పాదానీసా రిగరిగరిగరిసా రిగరిగరిగరిసా … పా
నినిని సనిద దదద నిదప పదనీ దనిసా సానిదపా

పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది
గట్టుమీద కన్నెలేడి గంతులేసి ఆడింది

నినినిససా రిసరిససా నినినిససా రిసరిససా
పట్టపగలు సిరివెన్నెల భరత నాట్య మాడింది
పట్టరాని లేత వలపు పరవశించి పాడింది… “కొండగాలి తిరిగింది”

పాదానీసా రిగరిగరిగరిసా రిగరిగరిగరిసా … పా
నినిని సనిద దదద నిదప పదనీ దనిసా సానిదపా

మొగలిపూల వాసనతో జగతి మురిసి పోయిందీ….
నాగమల్లి పూలతో నల్లని జడ నవ్వింది

నినినిససా రిసరిససా నినినిససా రిసరిససా
పడుచుదనం అందానికి తాంబూల మిచ్చిందీ…..
ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది… “కొండగాలి తిరిగింది”


 “వసంత గాలికి …” స్వరాలు
Opening ఆలాపన …
Flute: పసా.. నిసనిసనిసద దనిదనిదనిదప పదపదపదపగ
నిసదపగరిస
Guitar: గా.. పా.. దా..

వసంతగాలికి వలపులు రేగ వరించు బాలిక మయూరి కాగా
తనువు మనసు ఊగితూగి ఒక మైకం కలిగేనులే… ఈ మహిమ నీదేనులే
ప్రేమతీరు ఇంతేనులే, ఈ మహిమ నీదేనులే

Guitar: సని దప గరి నిని సా
Accordian: దగప దసనిదా దగపదనీ నిదపా నిదపా
Flute: పా.. దా.. ని.. రిగా పా రి సా ససారీస నినీదాద దదానీని
పాపా
Voilin: సా నిదప దపగరిసా
Guitar: గపదా

రవంత సోకిన చల్లని గాలికి (పదపగరిస) మరింత సోలిన
వసంతుడనగా
తనువు మనసు, ఊగి తూగి ఈ లోకం మారేనులే… ఈ మహిమ నీదేనులే
ఆహా.. భలే హాయిలే… ఈ మహిమ నీదేనులే “వసంత గాలికి”

Guitar: సని దప గరి నిని సా
Accordian: దగప దసనిదా దగపదనీ నిదపా నిదపా
Flute: పా.. దా.. ని.. రిగా పా రి సా ససారీస నినీదాద దదానీని
పాపా
Voilin: సా నిదప దపగరిసా
Guitar: గపదా

విలాస మాధురి, వెన్నెల కాగా
విహార వీణలు విందులు కాగా
ఏకాంతంలో నీవూ నేనే
ఒక స్వర్గం కనిపించెలే
ఈ మహిమ నీదేనులే.. ప్రేమ తీరు ఇంతేనులే .. ఈ మహిమ నీదేనులే
“వసంత గాలికి”

హిందోళ రాగం

(ఇంతకు ముందు వ్యాసాల్లో పరిచయం చేసిన మోహనం, అభేరి, సింధుభైరవి, కల్యాణి రాగాల్లాగే, హిందోళం రాగం కూడా చాలా ప్రసిద్ధమైన రాగం. రాగలహరి శీర్షికలో రాగాలను పరిచయం చేస్తున్నప్పుడు “ఏ రాగాలను పరిచయం చెయ్యాలి?” అన్న ప్రశ్న సహజంగానే వచ్చింది. ఈ రాగాలను ఎన్నుకోటంలో రెండు నియమాలు పాటించటం జరిగింది. మొదటిది జనసామాన్యానికి బాగా పరిచయమైన రాగం కావటం ఒకటి. ఎన్నుకున్న రాగంలో వీలైనన్ని సినిమా పాటలు ఉండటం మరొకటి. ఇప్పటి వరకు పరిచయం చెయ్యబడ్డ రాగాలు ఈ కోవకి చెందినవే! ఇప్పుడు పరిచయం చెయ్యబోతున్న హిందోళం రాగం ఐదో రాగం. ఐదు స్వరాలున్న హిందోళం రాగం, ఐదో రాగంగా పరిచయం చెయ్యడం కేవలం యాధృచ్ఛికమే!)

హిందోళం రాగం ఆధారంగా ఉన్న కొన్ని పాటలు
1. సందేహించకుమమ్మా… (లవకుశ)
2. కలనైనా నీ తలపే… (శాంతినివాసం)
3. నారాయణా హరి నారాయణా… (చెంచులక్ష్మి)
4. పగలే వెన్నెలా… (పూజాఫలం)
5. నేనే రాధనోయీ… (అంతా మన మంచికే)
6.పిలువకురా అలుగకురా… (సువర్ణ సుందరి)
7. మోహనరూపా గోపాలా… (కృష్ణ ప్రేమ?)
8. వీణ వేణువైన సరిగమ… (ఇంటింటి రామాయణం)
9. చూడుమదే చెలియా … (విప్రనారాయణ)
10. సామజవర గమనా… (శంకరాభరణం)
11. రాజశేఖరా నీపై… (అనార్కలి)
12. అందమె ఆనందం… (బ్రతుకు తెరువు)
13. శ్రీకర కరుణాలవాల… (బొబ్బిలి యుద్ధం)
14. రామ కధను వినరయ్యా… (లవకుశ)
15. మనసే అందాల బృందావనం… (మంచి కుటుంబం)
16. సాగర సంగమమే ప్రణయ… (సీతాకోక చిలుక)
17. కొండలలో నెలకొన్న కోనేటి… (అన్నమాచార్యుని కీర్తన)
18. ఓం నమశ్శివాయ… (సాగర సంగమం)
19. ఆధాహై చంద్రమా… (నవ్‌రంగ్‌)
20. భావోద్యానమునందు… (కరుణశ్రీ పద్యం ఘంటసాల)
21. మన్‌ తడపత్‌… (బైజు బావరా)
22. భజరే గోపాలం (సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన)

పంచస్వర రాగాలలో హిందోళం చాలా రక్తి కట్టించే రాగం. సప్తస్వరాలలోని “ప”, “రి” స్వరాలు హిందోళంలో లేవు!ఇంతకుముందు చెప్పుకున్న మోహనం రాగంలాగే, హిందోళం కూడా ఐదు స్వరాలున్న జనరంజకమైన ప్రసిద్ధ రాగం. అన్నీ కోమల స్వరాలే అవడం వల్ల, చాలా రుచిగా, తీయగా ఉండే రాగం. మనోధర్మ సంగీతం పాడటానికి అనుకూలమైన రాగం హిందోళం. ఈ రాగం అన్నివేళలా పాడవచ్చు. కచ్చేరీలలో ఈ రాగాన్ని ముఖ్యమైన రాగంగా తీసుకొని చాలాసేపు పాడవచ్చు. నిర్దిష్టమైన రూపంకలిగిన హిందోళం రాగం కరుణ, భక్తి, శృంగార రసాలను పోషింపగలదు.
8వ మేళకర్త అయిన హనుమత్తోడి జన్యరాగం హిందోళం. ఈ రాగంలో ప్రసిద్ధ రచనలు సామజవర గమనా (త్యాగరాజు), మనసులోని మర్మము (త్యాగరాజు), నీరజాక్షి కామాక్షి (ముత్తుస్వామి దీక్షితార్‌), భజరే గోపాలం (సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన).

స్వరస్థానాలు పరిచయం
ఇంతకు ముందు చెప్పినట్లు హిందోళం, ఔడవ రాగం. అంటే, ఆరోహణలోనూ అవరోహణలోనూ కూడా ఐదు స్వరాలే ఉంటాయి.
స X X గ1 X మ1 X X ద1 X ని1 X స
ఆరోహణ సగమదనిసా
అవరోహణ సానిదమగస

హిందూస్తానీ సంగీతంలో…

హిందూస్తానీ సంగీతంలోని “మాల్‌కోన్స్‌” రాగం మన కర్ణాటక సంగీత సాంప్రదాయంలోని హిందోళం రాగానికి సమానం. స్వరస్థానాల్లో హిందోళానికి, మాల్‌కోన్స్‌కి తేడాలు ఏమీ లేవు. నిజానికి, ఈ రెండు రాగాల్లో ఒకటి తెలిస్తే, రెండవ రాగాన్ని పోల్చుకోటం చాలా సులువు. మాల్‌కోన్స్‌ రాగం చాలా ప్రాచుర్యం పొందిన పాత రాగం. అతి మధురంగా ఉండే రాగాల్లో ఈ రాగం ముఖ్యమైనది. ఆరోహణ అవరోహణ స్వరాలు పైన చెప్పినట్లు కర్ణాటక పద్ధతిలో ఉన్నట్టుగానే ఉంటాయి. మాల్‌కోన్స్‌ రాగం పకడ్‌ ఇలా ఉంటుంది.
స మగ ధనిధమ గస
మాల్‌కోన్స్‌ రాగానికి వాది స్వరం “మ”, సంవాది స్వరం ” స”.

హిందూస్తానీ సంగీతంలో ఆందోళన స్వరాలని కొన్ని ఉంటాయి. అంటే, ఈ స్వరాలు పలుకుతున్నప్పుడు కాని, వాయిద్యాలపై పలికిస్తున్నపుడు కాని ఈ స్వర స్థానాల్లో “కంపనం” ఎక్కువగా చేస్తారు. సైన్సు భాషలో చెప్పాలంటే, ఆందోళన స్వరాల frequency కి అతిదగ్గరగా ఉండే ఇతర frequency లను కూడా పలకటం లేదా పలికించటం జరుగుతుంది. ఈ frequncy మార్పులు మరీ ఎక్కువైతే, పక్క స్వరంలోకి వెళ్ళిపోతాము. అలా కాకుండా, చాలా subtle గా ఉండేట్లుగా స్వరాన్ని కంపించేట్లుగా చెయ్యాలి. ఈ ఆందోళన స్వరాలనే మన కర్ణాటక సాంప్రదాయ సంగీతంలో “కంపిత” స్వరాలంటారు. మాల్‌కోన్స్‌లో గాని హిందోళంలో గాని “గ, ని, ధ” స్వరాలను ఆందోళన లేదా కంపిత స్వరాలంటారు. స్వరం “మ” ఆందోళన / కంపిత స్వరం కాదు. కంపించకుండా వదిలేసినపుడు, “మ” స్వరం ఠీవిగా ఉంటుంది. హిందోళం రాగంలా కాకుండా, మాల్‌కోన్స్‌ను రాత్రి 9 గంటలనుంచి అర్ధరాత్రి దాకా పాడతారు.

సినిమా పాటలు
హిందోళం లేక మాల్‌కోన్స్‌ రాగాల్లో సినిమా పాటలు బోలెడు వినిపిస్తాయి. “లవకుశ” (1963) సినిమా రిలీజ్‌ అయిన సెంటర్స్‌ అన్నిట్లోనూ 100 రోజులు ఆడిన మొదటి తెలుగు సినిమా అన్న విషయం సినిమా ప్రియులకు తెలిసిందే! ఈ సినిమా విజయానికి ఒక కారణం ఈ సినిమాలోని అన్ని పాటలూ, పద్యాలూ జనాదరణ పొందటమే! ఈ సినిమాలో హిందోళం రాగంలో ఘంటసాల కంపోజ్‌ చేసి పాడిన “సందేహించకుమమ్మా..” అన్న పాట చెప్పుకోతగ్గది. శుద్ధ హిందోళంలో వినిపించకూడని “పంచమం”, “రిషభం” స్వరాలను (ప, రి) ను చాలా గమ్మత్తుగా వాడుతూ, హిందోళం రాగం మూడ్‌ మార్చకుండా వాడుకున్న ఘంటసాలను మెచ్చుకుతీరాలి. ఇదే సినిమాలో “రామకధను వినరయ్యా..” అన్నపాట కూడా హిందోళంలో స్వరపరచిందే.ఆ నాటి ప్రముఖ గాయకులైన లీలసుశీల ల గొంతులను ఘంటసాల ఈ సినిమాలో ఉపయోగించినట్లు మరేసినిమాలోనూ ఏ సంగీతదర్శకుడూ ఉపయోగించలేదు. అలాగే ఘంటసాల సంగీత దర్శకత్వం చేసిన “గుండమ్మ కధ” సినిమాలో, ఎల్‌. విజయలక్ష్మి solo డాన్స్‌ చూపిస్తున్నప్పుడు నేపధ్య సంగీతంలో నాదస్వరం ద్వారా వినిపించే సంగీతం హిందోళంలో ట్యూన్‌ చెయ్యబడ్డదే! మనకి నాదస్వరంలాగే, ఉత్తర భారత దేశంలో చాలా పాప్యులర్‌ అయిన బిస్మిల్లాఖాన్‌ “షెహనాయి”లో మాల్‌కోన్స్‌లో ఉన్న బాణీ చాలా మంది సంగీత ప్రియులకు పరిచితమే!

సినిమా మాత్రమే కాకుండా పాటల ద్వారా కూడా పాప్యులర్‌ అయిన “శంకరాభరణం” సినిమా చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో “సామజవర గమన” అన్న పాట హిందోళం రాగంలో కూర్చబడిందన్న విషయం సినిమాలోనే చెప్పబడింది. ఐతే, ఈ పాట చివర్లో ఆలాపన పూర్తికాకుండానే పాటను ఆపేయటం జరుగుతుంది. “శుద్ధ హిందోళంలో రిషభం ఎలా వచ్చింది?” అన్న ప్రశ్న వస్తుంది. సినిమా కధకోసం కావాలనే హిందోళంలో అపస్వరమైన “రిషభం” స్వరం పాట చివరి ఆలాపనలో వాడబడటం నిజంగానే జరిగిందన్న విషయం, ఈ రాగంతోటీ, స్వరాలతోటీ పరిచయమున్న పాఠకులకు తెలిసే ఉంటుంది!

రహస్యం (1967) సినిమాలో ఘంటసాల సంగీత దర్శకత్వంలో రూపుదిద్దుకున్న “గిరిజా కల్యాణం” అనే యక్షగానం చాలా పాప్యులర్‌ అయింది. ఇందులో అనేక రాగాలు ఉపయోగించుకున్న ఘంటసాల (యక్షగాన రచయిత శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి సూచనమేరకు) “సామగ సాగమ” సాకారా (ఉమాబాల ధ్యాన నిష్ఠలో ఉన్న సదాశివుని సేవించే విధం) అనే అక్షరాలకు హిందోళం రాగంలో అవే స్వరస్థానాలు ఇవ్వటం గమనించతగ్గది.

తెలుగు సినిమాలకి సంగీతం ఇచ్చిన కన్నడ సంగీత దర్శకుల్లో రాజన్‌నాగేంద్ర జంట చెప్పుకోతగ్గది. “ఇంటింటి రామాయణం” అన్న సినిమా కోసం హిందోళంలో స్వరం ఇచ్చిన “వీణ వేణువైన సరిగమ” అన్న పాట ఒక మంచి పాట. ఈ పాటలో శుద్ధ హిందోళంలో వాడకూడని అంతర గాంధారం (తీవ్ర గాంధారం లేక గ2) వాడటం జరిగింది. అంటే, హిందోళంలో ఉన్న గ1 కాక గ2 కూడా వాడారు. ఐతే, ఈ రెండు గాంధారాలు వాడటం కొంత వింతగా ఉంటుంది. “వీణ (మామ) వేణు (గా2గ2) వైన (గా1గ1)” వంటి వాడకం జరిగింది. “వేణు వైన” అన్నప్పుడు “వేణు” లోని గ2 స్వరం నుంచి “వైన” అన్నపుడు వాడిన గ1 స్వరంలోకి glide అవుతుందన్నమాట. ఇలాంటి ప్రయోగాలు సంగీత దర్శకులకి కొత్త కాదు కానీ, హిందోళం రాగం ప్రసక్తి వచ్చింది కాబట్టి ఈ ఉదాహరణ సందర్భానికి తగ్గట్టే ఉంది.

హిందీ సినిమాల్లో కూడా మాల్‌కోన్స్‌ చాలా ఎక్కువగా వాడారు. ఉదాహరణకి, మహమ్మద్‌ రఫీ “బైజు బావరా” సినిమా కోసం పాడిన “మన్‌ తడపత్‌” అన్నది ఒక గొప్ప పాట. ఈ పాట వింటూంటే, తెలుగు సినిమాలలో హిందోళంలో కంపోజ్‌ చేసిన తెలుగు పాటలు చాలా గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా ఈ పాటలో రఫీ గొంతు, పాట ద్వారా పోషింపబడిన భక్తి రసం, అన్నిటికంటే ఎక్కువగా గుర్తు పట్టుకోవలసిన నౌషాద్‌ సంగీత దర్శకత్వం మరపు రానివి.

సినిమా పాటల ప్రసక్తి వచ్చినపుడు, (ర)సాలూరు రాజేస్వరరావు పేరు చెప్పకపోతే ఈ వ్యాసానికి సంపూర్ణత ఉండదు. అందుకనే, శ్రీ సాలూరు వారు “పూజా ఫలం” సినిమాకి కంపోజ్‌ చేసిన అన్ని గొప్ప పాటలలో, హిందోళంలో బాణీ కట్టి, శ్రీమతి ఎస్‌.జానకిచే పాడించిన ఈ క్రింది పాట స్వరాలతో ఈ వ్యాసం ముగిస్తున్నాను. ఉత్సాహం ఉన్న వాళ్ళు, ఒక చరణానికి మరొక చరణానికి మధ్యలోనూ చరణం మధ్యలోనూ వచ్చే స్వరాలు ప్రాక్టీస్‌ చెయ్యతగినవి.

“పగలే వెన్నెలా …” స్వరాలు
Opening ఆలాపన
పగలే వెన్నెలా జగమే ఊయలా
కదిలే ఊహలకే కన్నులుంటే …
Flute సానిదసా నిదమా నీదమనీ దమగా
Piano సమమగస మదదదమ దనినినిద నీసా

మొదటి చరణం
నింగిలోన చందమామ తొంగిచూచె (నీసాదనీ)
నీటిలోన కలువభామ పొంగిపూచె
ఈ అనురాగమే జీవన రాగమై (దనిసగ సమగమస)
ఎదలో తేనెజల్లు కురిసిపోదా “పగలే వెన్నెలా…”
Flute సానిదసా నిదమా నీదమనీ దమగా
Piano సమగస మదదదమ దనినినిద నీసా

రెండవ చరణం
కడలి పిలువ కన్నెవాగు పరుగు తీసె (నీసాదనీ)
మురళి పాట విన్న నాగు శిరసునూపె
నినిసస నినిసస దదనిని మమదదనిని దదనినిసా
ఈ అనుబంధమే మధురానందమై (దనిసగ సమగమస)
ఇలపై నందనాలు నిలిచిపోగా “పగలే వెన్నెలా…”
Flute సానిదసా నిదమా నీదమనీ దమగా
Piano సమగస మదదదమ దనినినిద నీసా

మూడవ చరణం
నీలి మబ్బు నీడ చూచి నెమలి ఆడె
పూల ఋతువు సైగ చూసి పికము పాడె
దనిసగసని దనిసగసని దనిసగసనిసా
మనసే వీణగా ఝణఝణ మ్రోయగా
బ్రతుకే పున్నమిగా విరిసి పోదా “పగలే వెన్నెలా…”

కల్యాణి రాగం

కల్యాణి రాగం ఆధారంగా ఉన్న కొన్ని పాటలు
1. జగమే మారినది మధురముగా ఈ వేళ… (దేశద్రోహులు)
2. తలనిండ పూదండ దాల్చిన రాణి… (ఘంటసాల ప్రైవేటు రికార్డ్‌)
3. మనసున మల్లెల మాలలూగెనే… (మల్లీశ్వరి)
4. మది శారదాదేవి మందిరమే… (జయభేరి)
5. పెనుచీకటాయే లోకం… (మాంగల్య బలం)
6.జోరుమీదున్నావు తుమ్మెదా … (శివరంజని)
7. పాడనావాణి కల్యాణిగా… (మేఘ సందేశం)
8. చల్లని వెన్నెలలో… (సంతానం)
9. మనసులోని కోరికా తెలుసు నీకు ప్రేమికా… (భీష్మ)
10. తోటలో నా రాజు తొంగి చూసెను నాడు… (ఏకవీర)
11. శ్రీరామ నామాలు శతకోటి… (మీనా)
12. పలుకరాదటే చిలుకా… (షావుకారు)
13. మము బ్రోవమని చెప్పవే సీతమ్మతల్లి… (రామదాసు కీర్తన)
14. జయ జయ జయ ప్రియభారత జనయిత్రి… (దేవులపల్లి దేశభక్తి గీతం)
15. పాలకడలిపై శేషతల్పమున పవళించేవా దేవా… (చెంచులక్ష్మి)
16. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌.. (దేవదాసు)
17. కిలకిల నవ్వులు చిలికిన … (చదువుకున్న అమ్మాయిలు)
18. దొరకునా ఇటువంటి సేవ… (శంకరాభరణం)
19. సలలిత రాగ సుధారస సారం… (నర్తనశాల)
20. మనసు పాడింది సన్నాయి పాట… (పుణ్యవతి)
21. రారా నా సామి రారా… (విప్రనారాయణ)
22. పెళ్ళిచేసుకొని ఇల్లుచూసుకొని… (పెళ్ళిచేసి చూడు)
23. పూవైవిరిసిన పున్నమి వేళ… (తిరుపతమ్మ కధ)
24. రావే నా చెలియా… (మంచిమనసుకు మంచి రోజులు)
25. విరిసే చల్లని వెన్నెలా… (లవకుశ)
26. వెలుగు చూపవయ్యా మదిలో కలతా బాపవయ్యా… (వాగ్దానం)
27. హాయి హాయిగా జాబిల్లి తొలి రేయి వెండి దారాలల్లి… (వెలుగు నీడలు)
28. ఆకసమున చిరుమబ్బుల చాటున… (AIR Private Record)
29. సరసాల జవరాలను… ( సీతారామ కల్యాణం)
30. సా విరహే తవదీనా … (విప్రనారాయణ)
31. హిమాద్రి సుతే… (కన్నడ సినిమా “హంస గీతె”)
32. నల్లని వాడా నే గొల్లకన్నెనోయ్‌.. (రావు బాలసరస్వతి ప్రైవేట్‌పాట)
33. సఖియా వివరింపవే … (నర్తన శాల)


              కర్ణాటక సంగీతంలో మరొక ముఖ్యమైన రాగం కల్యాణి. కల్యాణి రాగం శుభప్రదమైనది. కల్యాణ ప్రదమైనది. ఎంతమంది విద్వాంసులు ఈ రాగాన్ని పాడినా, పాడినవారికి, విన్నవారికి ఎప్పటికప్పుడే నిత్య నూతనంగా ఉంటుంది. ఈ రాగం ఆధారంగా జనించిన జన్యరాగాలు అనేకం ఉన్నాయి. హమీర్‌కల్యాణి, బేహాగ్‌, అమృతవర్షిణి, హంసనాదం మొదలైనవి ముఖ్యమైనవి. కర్ణాటక సంగీతంలోని ఐదు ముఖ్యమైన రాగాలైన కల్యాణి, తోడి, శంకరాభరణం, భైరవి, కాంభోజి రాగాల్లో కనీసం ఒక్క రాగమైనా లేకుండా ఒక చిన్న కచేరీ కూడా ఉండదు. అలాంటి ఈ ఐదు రాగాల్లో కూడా ముఖ్యమైన రాగం కల్యాణి.

              కల్యాణి రాగం 65వ మేళకర్త అయిన మేచకల్యాణి నుంచి జనించిన రాగం. మన కర్ణాటక సంగీత సాంప్రదాయంలో ప్రసిద్ధమైన 72 మేళకర్తలు ఏర్పడటానికి ముందే కల్యాణి రాగం ఉందని పండితుల అభిప్రాయం! 72 మేళకర్తల పద్ధతి ఏర్పడిన తరువాత, ఈ పధకం ప్రకారం కల్యాణి రాగం, 65వ మేళకర్త అయిన “మేచకల్యాణి” జన్యం అయింది.పూర్వ వాగ్గేయకారుల ప్రసిద్ధ రచనలు కల్యాణి రాగంలో చాలా ఉన్నాయి. “నిధి చాలా సుఖమా..”, “ఏతావునరా…”, “నమ్మి వచ్చిన…”, అమ్మ రావమ్మ…”, “వాసుదేవయని…”, “సుందరి నీ దివ్య రూపము…” వంటి త్యాగరాజ రచనలే కాక, “బిరాన వరాలిచ్చి…”, “హిమాద్రిసుతే…” వంటి శ్యామ శాస్త్రి రచనలు కూడా ప్రసిద్ధమైనవే!
 
                     మనోధర్మ సంగీతంలో కల్యాణి రాగానికి ఒక ప్రముఖ స్థానం ఉంది. అవకాశం వచ్చింది కాబట్టి మనోధర్మ సంగీతం గురించి రెండు మాటలు చెప్పుకోవాలి.శాస్త్రీయ సంగీతం అభ్యాస సంగీతమనీ, మనోధర్మ సంగీతమనీ రెండు విధాలు. ఇందులో మొదటిది గురుముఖంగా నేర్చుకొనే అలంకారాలూ, గీతాలూ, వర్ణాలూ, కృతులు మొదలైనవి ఉంటే, రెండవ విధానమైన మనోధర్మ సంగీతంలో స్వరకల్పన, రాగం, పల్లవి మొదలైనవి ఉదాహరణలుగా చెప్పవచ్చు.ఈ రెండు విధానాలైన సంగీతాలలో కూడా పాండిత్యం సంపాదించినప్పుడే, సంగీతంలో సంపూర్ణతని సాధించగలుగుతారని విద్వాంసుల అభిప్రాయం. మనలో చాలామందికి శాస్త్రీయ సంగీతంలో పరిచయం, ప్రవేశం లేకపోయినా అంతో, ఇంతో సంగీతం మనకి తెలియటానికి కారణం, మనకి తెలియకుండానే మనం మనోధర్మ సంగీతం అభ్యసించడమే! తేలిక మాటల్లో చెప్పాలంటే, సంవత్సరాల తరబడి సంగీతాన్ని విని, విని వినికిడి అనుభవంతోనే రాగాలు పాడగలిగిన వాళ్ళు మనోధర్మ సంగీత పద్ధతిని పాటిస్తున్నారన్నమాట. సుప్రసిద్ధ సంగీత విద్వాంసుడు పద్మభూషన్‌డా. శ్రీపాద పినాకపాణి గారు మనోధర్మ సంగీతం గురించి చెప్పిన ఈ క్రింది మాటలు ఈసందర్భంలో గుర్తుకు తెచ్చుకోవడం అవసరం.

                        ” తమిళనాడులో, గురువు వద్ద సంగీతం అభ్యసించకపోయినా, సంవత్సరాలపాటు రాగాలాపన విని, వినికిడి అనుభవంతోనే రాగాలు పాడగలిగిన వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఆంధ్రదేశంలో శాస్త్రీయ సంగీతం అంత ధారాళంగా వినబడడానికి మనం నోచుకోలేదు. అందుచేతనే సంగీతం యధావిధిగా నేర్చిన విద్యార్ధులకు కూడా రాగం పాడే శక్తి రావడంలేదు. గురువే రాగం పాడుతూ విద్యార్ధిచేత పాడిస్తూ నేర్పాలి. నొటేషను వ్రాసి, చదువనేర్చిన విద్యార్ధికి ప్రసిద్ధరాగాలలో తరచూ వినబడే సంగతులను స్వరపరచి వ్రాసిచ్చి, వాటిని కంఠోపాఠంగా వచ్చేవరకూ చెప్పి, పాడించాలి. విద్వాంసులు పాడే రాగాలాపనలను నిరంతరం వింటూ ఉండడం అన్నిటికంటే ఎక్కువ అవసరం. స్వరకల్పన పాడుతూ పాడించినట్లే, రాగం కూడా గురువు నేర్పాలి.

                    ప్రతివిద్యార్ధికీ, “మనోధర్మ సంగీతం”, అభ్యాస సంగీతం లాగే పాఠం చెప్పి నేర్పించాలి. అలా చెప్పగా విద్యార్ధులకు మనోధర్మ సంగీతజ్ఞానం తప్పక లభిస్తుంది. ఇది వట్టి మాట కాదు! అనుభవంతో చెప్పిన సలహా.”
స్వరస్థానాలు పరిచయం

                  కల్యాణి సంపూర్ణ రాగం. అంటే ఆరోహణలోనూ, అవరోహణలోనూ కూడా ఏడు స్వరాలూ ఉపయోగించే రాగం. మూలస్వరాలైన “స”, “ప” లు కాక ఉపయోగించే స్వర స్థానాలు చతిశ్రుతి రిషభం, అంతర గాంధారం, ప్రతి మధ్యమం, చతుశ్రుతి దైవతం, కాకలి నిషాదం. కల్యాణి రాగం ప్రయోగ ప్రసిద్ధి రాగం. ముఖ్యంగా పంచమం (స్వరం “ప”) వాడకుండా ఎక్కువ ప్రయోగాలు చెయ్యవచ్చు. అలాగే మూల స్వరాలైన “స”, “ప” లను రెంటినీ విడిచి, “రి గ మ ద ని” స్వరాలతో ప్రయోగాలు చేయ్యవచ్చు. ఆలాపనకి చాలా అవకాశం ఉన్న కల్యాణి రాగం, చాలా elaborateగా పాడి రాగం యొక్క depths చూపించటానికి అవకాశం ఉన్న రాగం ఇది. ఇక్కడ ఒక ముఖ్య విషయం గుర్తుంచుకోవాలి. అన్ని రాగాలలో creativity చూపించుకోటానికి అవకాశం ఒకే విధంగా ఉండదు! కొన్ని రాగాలు elaborateగా పాడటానికి వీలుండదు (గాయకురాలు/గాయకుడు ఎంత సమర్ధురాలైనా/సమర్ధుడైనా). కీబోర్డ్‌మీద కాని, మరే వాయిద్యం పైన కాని కల్యాణి రాగం వాయించ ప్రయత్నిస్తే, స్వరస్థానాలు ఈ విధంగా ఉంటాయి.
 
స X రి2 X గ2 X మ2 ప X ద2 X ని2 స
ఆరోహణ           సరిగమపదనిసా
అవరోహణ        సానిదపమగరిస

                  కల్యాణి రాగాన్ని “తీవ్ర” రాగం అంటారు. రాగలక్షణంలో తీవ్రమైన అనుభూతుల్ని చూపించకపోయినా, స్వరస్థానాల దృష్య్టా, అన్ని స్వరాలూ “తీవ్ర” స్వరాలే కాబట్టి, కల్యాణి రాగాన్ని “తీవ్ర రాగం” అంటారేమో!
హిందూస్తానీ సంగీతంలో…
హిందూస్తానీ సంగీతంలోని “యమన్‌” రాగం మన కర్ణాటక సంగీత సాంప్రదాయంలోని కల్యాణి రాగానికి సమానం. స్వరస్థానాల్లో కల్యాణికి, యమన్‌కి తేడాలు ఏమీ లేవు. మనసుకు చాలా ఆహ్లాదం కలిగించే ఈ రాగం రాత్రి మొదటి వేళల్లో పాడుకొనే రాగం. పైన చెప్పినట్టు, హిందూస్తానీ సంగీతంలో కూడా మూలస్వరాలైన “స”, “ప”లను విడిచి ప్రయోగాలు చేస్తారు. హిందూస్తానీ పద్ధతిలోని యమన్‌ పకడ్‌ ఈ రకంగా ఉంటుంది.
నిరిగరి స పమగ రి పరిస
ఆరోహణ స్వర సంచారాల్లో “నిరిగ”, “మదని” ఎక్కువగా వాడతారు. అవరోహణ స్వరాల్లో “గ” స్వరాన్ని వదిలేసి, “పరిస” అన్న ప్రయోగం ఎక్కువగా ఉపయోగిస్తారు.
 
సినిమా పాటలు
సినిమా పాటల్లో కల్యాణి రాగాన్ని చాలా ఎక్కువగా వాడారు. ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు బాలమురళీకృష్ణ సంగీత సారధ్యంలో భైరవి నరసయ్య అనే సంగీత విద్వాంసుడి కధను “హంస గీతె” అన్న కన్నడ సినిమాగా తీసారు. సినిమా మొత్తం భైరవి రాగం మీద focus చేసినా, కల్యాణి రాగంలో ఈ సినిమాలో పాడిన “హిమాద్రి సుతే” అన్న శ్యామ శాస్త్రి రచన చెప్పుకోతగ్గది. ఇందులో విశేషం ఏమిటంటే, శ్యామశాస్త్రి రచనని రెండు విభిన్న తాళాలలో ఇద్దరు గాయకులు పాడడం (గాయకులు బాలమురళీకృష్ణ, ఎం. వి. రమణమూర్తి గార్లు) ప్రయోగాత్మకంగా ఉంది. ఈ రెండు పాటలు “కల్యాణి” రాగంలోనే పాడినా, తాళాలు వేరుగా ఉండటం వల్ల కొంత వింతగానూ, కొత్తగానూ ఉంటాయి.
 
                     హిందీ సినిమాల్లో కూడా “యమన్‌” రాగాన్ని విపరీతంగా వాడుకున్నారు. “బర్సాత్‌కి రాత్‌” అన్న సినిమాలో మహమ్మద్‌రఫీ పాడిన “జిందగీభర్‌నహీ భూలేంగే” అన్నపాట, “చిత్‌చోర్‌” సినిమాలో ఏసుదాసు, హేమలతా పాడిన “జబ్‌దీప్‌జలే ఆనా..” అన్న పాట యమన్‌రాగంలో compose చేసినవే! కల్యాణి, యమన్‌రాగాల పోలికలు, తేడాలు తెలియాలంటే తెలుగులోనూ, హిందీలోనూ ఒకేపేరుతో తీసిన “సువర్ణ సుందరి” అన్న సినిమాలో ని “హాయి హాయిగా ఆమనిసాగే..” అన్న తెలుగుపాట, ” కుహూ కుహూ బోలే కోయలియా..” అన్న హిందీ పాట నాల్గవ (ఆఖరి) చరణం జాగ్రత్తగా వినండి. ఈ పాటలు ముందు తెలుగులోనూ, తరవాత హిందీలోను వచ్చాయి. సుప్రసిద్ధ సంగీత దర్శకుడు శ్రీ ఆది నారాయణ రావు సంగీత దర్శకత్వంలో స్వరం కట్టబడ్డ ఈ పాటలు రాగమాలికలు. ఈ పాటల్లోని నాలగవ చరణం ముందు వచ్చే ఆలాపన, తరవాత చరణం పాడుతున్నపుడు ఘంటసాల & జిక్కీ కల్యాణి రాగాన్ని పాడితే, రఫీ & లత యమన్‌రాగాన్ని పాడతారు. సినిమాపాటల ద్వారా ఈ రెండు రాగాలకి పోలికలు, తేడాలు తెలియాలంటే ఈ పాటలు ఒక మంచి ఉదాహరణలు.

          తెలుగు సినిమాపాటల్లో కల్యాణి రాగంలో ప్రఖ్యాత సంగీత దర్శకుడు శ్రీ సాలూరు రాజేశ్వర రావు తీసుకువచ్చినంత variety ఇంకే సంగీత దర్శకుడు తీసుకురాలేదంటే అతిశయోక్తి కాదు. ఈయన పాటల్లో మామూలుగా కనపడే richness కల్యాణి రాగంలో మరీ కొట్టచ్చిన్నట్టు తెలుస్తుంది. దేశద్రోహులు సినిమా కోసం స్వరం చేయబడ్డ “జగమే మారినదీ మధురముగా ఈ వేళ” అన్న పాట కల్యాణి రాగంలో స్వరపరచబడ్డ ఒక గొప్ప తెలుగు సినిమా పాట. పాట మొదలవుతూనే వినిపించే piano ద్వారా set చెయ్యబడ్డ తాళం, ఘంటసాల కంచు కంఠంతో, రెండవ చరణంలో “విరజాజుల సువాసన స్వాగతములు పలుక సుస్వాగతములు పలుకా” తరవాత వచ్చే ఆలాపన అతి మధురంగానూ, లలితం గానూ ఉంటుంది. ఇదే చరణంలో “కమ్మని భావమే కన్నీరై చిందెనూ” తరవాత ఒక చక్కటి violin bit వేస్తాడు రాజేశ్వర రావు. ఇంత గొప్పగా ఇలా compose చేసిన ఈ పాటను, మల్లీశ్వరి సినిమాలోని all time great song “మనసున మల్లెల మాలలూగెనే..” తో పోల్చండి. రెండూ కల్యాణి రాగంలో ట్యూన్‌ చెయ్యబడ్డవే. పి. బి. శ్రీనివాస్‌చే సాలూరి వారు పాడించిన “మనసులోని కోరిక..”అనేపాట కల్యాణి రాగంలో బాణీ కట్టబడ్డ మరొక గొప్ప పాట.చెంచులక్ష్మి సినిమాలోని “పాలకడలిపై శేషతల్పమున …” అన్న గొప్ప భక్తి పాట కూడా కల్యాణి రాగంలో రాజేశ్వర రావు స్వరం ఇచ్చిందే! ఇలా ప్రతి పాటలోనూ మిగిలిన పాటలకన్న తేడాగా ట్యూన్‌ఇస్తూనే, కల్యాణి రాగాన్ని exhaust చేసినట్టనిపిస్తుంది.
 
                        కల్యాణి రాగాన్ని చాలామంది సంగీత దర్శకులు, హుషారైన పాటలకు వాడుకున్నారు. సాధారణంగా విషాద గీతాలకు కల్యాణి వంటి రాగాలు వాడరు. ఇందుకు భిన్నంగా రెండు ఉదాహరణలు ఇస్తాను. ముందు దేవదాసు సినిమా కోసం శ్రీ సుబ్బురామన్‌ఘంటసాలచే పాడించిన “కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌.” అన్న పాట. ఈపాట విన్న మొదట్లో నేను ఇది కల్యాణి రాగం అని గమనించలేదు. Flute మీద వాయించిన తరవాత ఈ పాట కల్యాణి రాగంలో ఇంత గొప్పగా ఎలా ట్యూన్‌ ఇచ్చాడో తెలుసుకున్న తరవాత, శ్రీ సుబ్బురామన్‌గారి మీద గౌరవం పెరిగింది. మాంగల్య బలం (పాతది) సినిమా కోసం మాస్టర్‌వేణు కూడా ఇలాంటి ప్రయత్నమే చేసాడు. “పెనుచీకటాయే లోకం…” అన్న విషాద గీతం కూడా కల్యాణి రాగం అధారంగా బాణీ కట్టిందే. ఈ పాటలో ప్రతి మధ్యమం, శుద్ధ మధ్యమం రెండూ వాడబడ్డాయి.
సినిమా పాట కాకపోయినా, ఘంటసాల పాడిన అనేక private recordsలో బాగా popular అయిన “తలనిండ పూదండ దాల్చిన రాణి …” అన్నపాట కల్యాణి రాగంలో బాణీ కట్టిందే. ఉత్సాహంగా ఏదైనా instrument మీద వాయించే వారికోసం స్వరాలు ఇక్కడ ఇస్తున్నాను.
 
“తలనిండ పూదండ దాల్చిన రాణి …” స్వరాలు
Opening
Notes of Chord స గా పా
ఆరజనీకర మోహన బింబము … మ ప మా
నీనగుమోమును బోలునటే
కొలనిలోని, నవకమల దళమ్ములు, నీ నయనమ్ముల బోలునటే …

ని రి స
ఎచట చూసినా, ఎచట వేచినా, నీరూపమదే, కనిపించినదే …

తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలకా నవ్వులతోడ మురిపించబోకే

1st Interlude
సాసాసా దా నీపా దాగా
దాదాదా పా గారీ నీసా

వీణ
దానిరీ గామా దానీసా
మొదటి చరణం
పూల వానలు కురియు మొయిలువో …
మొగలి రేకులలోని సొగసువో … నా రాణి
“తలనిండ…”

2nd Interlude
సాసాసా నీదాపాగారీసా (వీణ) పాగాసరీ
రిగా నీనీనీ దాపాగా రీనీసా (వీణ) గారీనీసా

వీణ
దానీ రీ గా మా దానీ నిగరీ నిదమపా
రెండవ చరణం
నీ మాట బాటలో నిండే మందారాలు … మపమా గారీరి
నీ పాట తోటలో నిగిడే శృంగారాలు… నిసనీ దాపాప
నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు …
నీ నీలవేణిలో నిలిచే ఆకాశాలు….

గాగాగా రిసని దపగా మాదానిసా
“తలనిండ…”

Tuesday, December 18, 2012

Sindhu Bhairavi Raagam

సింధుభైరవి రాగం ఆధారంగా ఉన్న కొన్ని పాటలు, పద్యాలు

1. ముద్ద బంతి పూవులో… (మూగ మనసులు)
2. మెల్లగ వీచే చల్లగాలికి… (గుండమ్మ కధ)
3. చేసేది ఏమిటో చేసేయి సూటిగా… (తెనాలి రామకృష్ణ)
4. కాదు సుమా కల కాదు సుమా… (కీలు గుఱ్ఱం)
5. గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన… (సప్తపది)
6.ఏమని పాడెదనో ఈవేళ … (భార్యాభర్తలు)
7. సంసారం సంసారం ప్రేమ సుధా పూరం… (సంసారం)
8. జగములా దయనేలే జనని… (తెనాలి రామకృష్ణ)
9. తెలియగలేరే నీలీలలు… (చెంచులక్ష్మి)
10. ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు… (ఉయ్యాల జంపాల)
11. నందుని చరితము వినుమా… (జయభేరి)
12. ఏమిటో ఈమాయా ఓ చల్లని రాజా… (మిస్సమ్మ)
13. వాడిన పూలే వికసించెనే… (మాంగల్య బలం)
14. ఇదేనండి ఇదేనండి భాగ్యనగరం… (ఎం. ఎల్‌. ఎ)
15. వ్రేపల్లియ ఎదఝల్లున… (సప్తపది)
16. అనురాగాలు దూరములాయనా… (విప్రనారాయణ)
17. కరుణాలవాల ఇది నీదు లీల… (చెంచులక్ష్మి)
18. నడిరేయి ఏఝాములో… (రంగులరాట్నం)
19. ఇంతేరా ఈజీవితం తిరిగే రంగులరాట్నము… (రంగులరాట్నం)
20. భలేభలే అందాలు సృష్టించావు… (భక్త తుకారం)
21. బ్రహ్మయ్యా ఓ బ్రహ్మయ్యా… (పెళ్ళిచేసి చూడు)
22. జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా… (శభాష్‌రాముడు)
23. చాలదా ఈపూజా దేవి… (శ్రీ కృష్ణార్జున యుద్ధం)
24. సింహాచలము మహా పుణ్యక్షేత్రము… (సింహాచల క్షేత్ర మహిమ)
25. మ్రోగింది గుడిలోని గంట… (శ్రీమతి)
26. వెన్నెల పందిరిలోన… (బంగారు పాప)
27. ఓహో యాత్రికుడా… (సాలూరి రాజేశ్వర రావు)
28. రామ రామయనరాదా… (ప్రయాగ రామదాసు కీర్తన)
29. సంజవెలుంగులో పసిడి ఛాయల… ( కరుణశ్రీ పద్యం ఘంటసాల)
30. మన ప్రేమ… (AIR రికార్డ్‌, మంగళంపల్లి శ్రీరంగం గోపాలరత్నం)
31. భయమేలా ఓ మనసా… (భలే రాముడు)
32. సంగీతమేలనే… (రావు బాలసరస్వతి)
33. పయనమయే ప్రియతమ నను మరచిపోకుమా … (లైలా మజ్ను)

మన సంగీతంలో మరొక ముఖ్యమైన రాగం సింధుభైరవి. ఆర్తి కలిగిన ఈ రాగం, కరుణరస ప్రధానమైనది. గొప్ప సంగీతానందం (Aesthetic Bliss) ఇచ్చే రాగం సింధుభైరవి. ప్రయోగ ప్రధానమైన ఈ రాగం, ఎంతమంది ఎన్ని సార్లు పాడినా తరగని అవకాశం, తరగని స్వర బృందాలు కలిగిన రాగం. ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. సింధుభైరవి రాగంలో సినిమాపాటలు (పైన ఇచ్చిన లిస్ట్‌చూడండి), వాద్య బృంద రచనలు, జానపదాలు, భజనలు, దేశ భక్తి పాటలు, లలిత గీతాలు వేలకు వేలు ఉన్నాయి. అయినప్పటికీ, ఈ రాగంలో కొత్తకొత్త పాటలు వస్తూనే ఉన్నాయి.
సింధుభైరవి రాగాన్ని దేశీయ రాగం అంటారు. అంటే, అన్య (హిందూస్తానీ) పద్ధతికి చెందిన ఈ రాగాన్ని మన కర్ణాటక సంగీత సాంప్రదాయకులు సింధునదీ ప్రాంత భైరవిగా గుర్తించి పెట్టుకున్న పేరు “సింధుభైరవి”. సాధారణంగా మన కచ్చేరీలలో చివరగా పాడే రాగం సింధుభైరవి. హిందూస్తానీ సంగీత కచ్చేరీలలో కూడా భైరవి రాగాన్ని (హిందూస్తానీ సంగీతంలోని భైరవి రాగం మన కర్ణాటక సంగీతంలోని సింధుభైరవి కి సమానం) పాడిన తరవాత ఇంక ఏ రాగాన్ని పాడరు. ఇదే ఆఖరి రాగం. కానీ, కర్ణాటక సాంప్రదాయంలో అంత ఖచ్చితంగా ఈ పద్ధతి పాటించరు. సింధుభైరవి పాడిన తరవాత సురటి గాని మధ్యమావతి గాని పాడతారు.

స్వరస్థానాలు పరిచయం
             కర్ణాటక సాంప్రదాయ సంగీతంలో, పూర్వ వాగ్గేయకారులు సింధుభైరవి రాగంలో కృతులు కాని మరే రచనలు చెయ్యలేదు. కర్ణాటక సంగీతంలోని 72 మేళకర్తలలో 8వ మేళకర్త అయిన హనుమత్తోడి నుంచి జనించిన రాగం సింధుభైరవి. స్వరపరంగా సింధుభైరవిలో ఆరోహణలోనూ, అవరోహణలోనూ సప్తస్వరాలున్నాయి. కీబోర్డ్‌మీద కాని, మరే వాయిద్యం పైన కాని సింధుభైరవి వాయించ ప్రయత్నిస్తే, స్వరస్థానాలు ఈ విధంగా ఉంటాయి.
స రి1 X గ1 X మ1 X ప ద1 X ని1 X స
ఆరోహణ సరిగమపదనిసా
అవరోహణ సానినీదపామాగరిగారిసా లేక సనిదపమగరిస
కర్ణాటక సాంప్రదాయం ప్రకారం సింధుభైరవిలో ఉన్న స్వరాలు షడ్జమం, శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ ధైవతం, కైశిక నిషాధం. కాని అన్య స్వరాలైన (రి2, గ2, మ2, ద2, ని2) అన్నిస్వరాలు ఈ ప్రయోగ ప్రధాన రాగంలో ఉన్నాయి. అంటే, మొత్తం 12 స్వరస్థానాలూ ఈ రాగంలో వాడవచ్చు. అయితే, సింధుభైరవి రాగంలోని అన్య స్వరాలు ఏ సందర్భాలలో పాడాలో, ఎలా పాడితే అందంగా ఉంటుందో తెలిసిన విద్వాంసుల ద్వారా తెలుసుకొని పాడాలి!

హిందూస్తానీ సంగీతంలో…
హిందూస్తానీ సంగీతంలో సింధుభైరవి అన్న రాగం ఉన్నా, మన సాంప్రదాయం లోని సింధుభైరవికి అతి దగ్గరగా ఉండే హిందూస్తానీ రాగం “భైరవి”. హిందూస్తానీ పద్ధతిలోని ఈ “భైరవి” రాగం చాలా పాప్యులర్‌రాగం. శాస్త్రీయ సంగీతం లోనే కాకుండా, భైరవి రాగం ఆధారంగా అనేక హిందీ పాటలు ట్యూన్‌చెయ్య బడ్డాయి. ముఖ్యంగా 1950, 60 దశాబ్దాలలో వచ్చిన హిందీ సినిమాల్లోని పాటల్లో “భైరవి” వాడకం ఎక్కువగా కనపడుతుంది.

ఈ వ్యాసం ముందు ఇచ్చిన లిస్ట్‌లో ఉన్న పాటలు మీకు పరిచయం ఉంటే, ఈ పాటల మధ్య ఉన్న పోలికలు మీకు తెలుస్తాయి. ఆంటే, అప్పుడప్పుడు మీకు తెలియకుండానే ఒక పాట నుంచి మరొక పాటలోకి దూకేస్తారు. దీనికి కారణం వీటన్నిటిలోనూ ఉన్న రాగలక్షణం ఒకటి కావటమే! ఈ మధ్య ప్రముఖ కధకుడు శ్రీ “భరాగో” (భమిడిపాటి రామగోపాలం) గారి వ్యాసం ఒకటి చదివాను. పాత సినిమా పాటల గొప్పతనాన్ని గురించి వ్రాస్తూ, 1949లో రిలీజ్‌అయిన “కీలుగుఱ్ఱం” సినిమా రిలీజ్‌అయిన రోజునే చూసిన భరాగో స్నేహితుడు ” మొత్తం మూడు గంటల సినిమాలోనూ మూడు నిమషాలు బాగుంది. ఆ మూడు నిమషాలైనా బాగుండటానికి కారణం కాదుసుమా కల కాదు సుమా అన్న పాట!” అన్నాట్ట. నిజంగా అలాంటి ఈ పాటకి సంగీత దర్శకుడు ఘంటసాల స్వరం ఇచ్చింది సింధుభైరవి రాగంలోనే! ఈ పాట చరణంలో వచ్చే “ప్రేమలు పూచే సీమల లోపల …” అన్న పదాల తరవాత సాగే ఆలాపన, పాట మొత్తంలో వినిపించే ఘంటసాల లేత గొంతు, ఆ స్వరకల్పన 50 ఏళ్ళ తరవాత కూడా ఇంకా మనకి గుర్తు ఉన్నాయంటే ఈ పాట ఎంత గొప్పదో తెలుస్తోంది. అలాగే 1949లో రిలీజ్‌అయిన మరొక సంగీత పరమైన గొప్ప చిత్రం ” లైలా మజ్ను” గురించి తప్పకుండా చెప్పుకోవాలి. శ్రీ సి. ఆర్‌. సుబ్బురామన్‌సంగీత దర్శకత్వంలో సింధుభైరవిలో ఘంటసాల పాడిన “పయనమయే ప్రియతమ నను మరచిపోకుమా …” అన్న పాట మనకున్న పాత సినిమా పాటల్లో మరొక గొప్ప పాట. సింధుభైరవి రాగంలో అన్యస్వరాలైన రి2, గ2, ని2 ( చతుశ్రుతి రిషభం, అంతర గాంధారం, కాకలి నిషాధం) స్వరాలను అందంగా వాడారు శ్రీ సుబ్బురామన్‌. ఈ పాటలోని రెండవచరణంలోని “విధి బలీయమని తెలుసూ తెలుసు నాకు నీమనసు” అన్న పదాల్లో “విధి” అన్నప్పుడు అంతర గాంధారం (గ2), “తెలుసు” అన్నప్పుడు చతుశ్రుతి రిషభం (రి2), కాకలి నిషాధం (ని2) వాడటం జరిగింది. మొత్తం మీద పాత సినిమా సంగీత దర్శకులు సింధుభైరవి రాగంలో ఎక్కువగానే స్వర రచనలు చేసారు. గుండమ్మ కధ, సంసారం, పెళ్ళిచేసి చూడు, లాంటి సినిమాల్లోనే కాకుండా ప్రైవేటు రికార్స్డ్‌లో చాలానే పాటలు, పద్యాలు సింధుభైరవి రాగంలో కట్టారు.

ఈ వ్యాసం ముందు ఇచ్చిన పాటల లిస్ట్‌చూస్తే, తెలుగు సినిమా పాటల స్వర కల్పనలో, వాసిలోనూ రాసిలోనూ కూడా మొదట చెప్పుకోవలసిన ప్రఖ్యాత సంగీత దర్శకుడు, గాయకుడు శ్రీ సాలూరు రాజేశ్వరరావు, సింధుభైరవి రాగంలో ఎంతటి వైవిధ్యంగా పాటల స్వరకల్పన చేసారో తెలుస్తుంది. “రంగుల రాట్నం” సినిమా కోసం “నడిరేయి ఏ ఝాములో…” , “ఇంతేరా ఈ జీవితం…” అన్న రెండు పాటలు సింధుభైరవి రాగంలో స్వరం కట్టినా, ఈ రాగం ప్రయోగంలో వాడుకొన్న తేడాలు తేలికగా కనపడతాయి. అలాగే, “ఓహో యాత్రికుడా …” అన్న ప్రైవేటు పాట సింధుభైరవి రాగంలో స్వర పరచి పాడినవారు సాలూరు వారే!

ప్రముఖ తెలుగు సినీ నేపధ్య గాయకుడు శ్రీ పి. బి. శ్రీనివాస్‌(ప్రతివాది భయంకర శ్రీనివాసాచార్యులు), సాలూరు వారి సంగీత దర్శకత్వంలో పాడాలని ఉబలాటపడుతున్న రోజుల్లో, శ్రీ పి. బి. శ్రీనివాస్‌గారికి మొదటి ఛాన్సు ఇచ్చి పాడించిన పాట సింధుభైరవి రాగంలో బాణీ కట్టినదే! ఆ పాట భలే రాముడు సినిమాలోని “భయమేలా ఓమనసా..” అన్న పాట. ఎవరన్నా ఈపాటను ఏదైనా instrument పై పలికించ ప్రయత్నిస్తే, సింధుభైరవిలో అన్య స్వరాలను అందంగా ఎలా ఉపయోగించారో తెలుస్తుంది. చరణం మధ్యలో వచ్చే, “శ్రీకృష్ణుని నమ్మేవా నీ కష్టాలన్నీ ..” అన్నప్పుడు సింధుభైరవిలోని అన్య స్వరమైన చతుశ్రుతి (తీవ్ర) రిషభం (రి2) “నీ కష్టాలన్నీ” లో వినపడుతుంది. శ్రీ సాలూరు రాజేశ్వర రావు + సింధుభైరవి అన్నప్పుడు, భార్యాభర్తలు సినిమాలో సింధుభైరవిలో స్వరం చేసిన “ఏమని పాడెదనో ఈవేళా …” అన్న శ్రీమతి సుశీల పాడిన పాటను గుర్తు చేసుకోకుండా ఉండలేం!

ఘంటసాల వెంకటేశ్వర రావు, సాలూరు రాజేస్వర రావు వంటి గొప్ప సంగీత దర్శకుల్లాగే శ్రీ పెండ్యాల నాగేశ్వర రావు కూడా చాలా ఎక్కువగా సింధుభైరవి రాగాన్ని సినిమా పాటల్లో వాడారు. ప్రఖ్యాత గాయకుడు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన “ఏటిలోని కెరటాలు ఏరువిడిచి పోవు ..” అన్న సింధుభైరవి రాగంలో కట్టిన పాట ఈనాటికి కూడా పాప్యులర్‌పాటే! సినిమా పాటల గురించి చాలా విషయాలు చెప్పటానికి ఉన్నా, రేడియో ద్వారా లలిత సంగీతాన్ని ప్రజలకు అందించిన సంగీత దర్శకులు, గాయకులు కూడా సింధుభైరవి రాగాన్ని చాలా ఎక్కువగా ఉపయోగించుకొన్నారన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఒకప్పటి విజయవాడ రేడియో ఆర్టిష్టులైన శ్రీ బాలాంత్రపు రజనీకాంత రావు, శ్రీ వోలేటి వెంకటేశ్వర్లు, శ్రీ మంగళంపల్లి బాల మురళీకృష్ణ, శ్రీమతి శ్రీరంగం గోపాలరత్నం వంటి వారు చాలా లలిత గీతాలు సింధుభైరవి రాగంలో పాడారు.

పైన చెప్పిన సంగీత దర్శకుల తరవాత తరంలో గుర్తుపెట్టుకోతగిన సంగీత దర్శకుడు శ్రీ కె. వి. మహాదేవన్‌. “సప్తపది” సినిమాలో ఆయన స్వరం ఇచ్చిన రెండు సింధుభైరవి పాటలూ హిట్సే! (ముందు ఇచ్చిన పాటల లిస్టు చూడండి) ఈ పాటలకన్న ముందు గుర్తు పెట్టుకోవలసిన పాట మూగమనసులు సినిమాకోసం సింధుభైరవి రాగంలో స్వరం ఇచ్చిన “ముద్దబంతి పూవులో …” అన్న పాట. ఈ పాట వచ్చిన కొత్తల్లో ఎంత ప్రజాదరణ పొందిందో, ఇప్పటికీ తెలుగువాళ్లల్లో అంత పాప్యులర్‌అయిన పాట ఇది.  ఏదైనా ఒక instrument మీద వాయించడానికి ఇష్టపడే వారికి వీలుగా ఈపాట స్వరాలు ఇక్కడ ఇచ్చాను.

“ముద్దబంతి పూవులో …” స్వరాలు

Opening
ముద్దబంతి పూవులో మూగకళ్ళ ఊసులో
Notes of Chord సమదస గమపా మగరిస
ముద్దబంతి పూవులో మూగకళ్ళ ఊసులో
ఎనక జనమ బాసలూ ఎందరికీ తెలుసులే …. ముద్దబంతి..
1st Interlude నిని సస సారిగా రిరి రిగ రీరీస
String సగ సపగ సస నిదని ససాని ససాని దపదా
Flute గమప మమ మపద పప
String గమదని సరి మగరిగసా
మొదటి చరణం
పూలదండలో దారం దాగుందని తెలుసును
పాలగుండెలో ఏదీ దాగుందో తెలుసునా
నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి
ఏ కన్నీటెనకాలా ఏముందో తెలుసునా … ముద్దబంతి..
2nd Interlude
Flute పదప మామ మమమ గా గా మమమమ మామగ
పద పపప పద పదని ససని నిసాని నినిని నిని దపమగ
పదప మమ మాగరి సనిగా రిసనిదరీ
String సస గగమా
రెండవ చరణం
మనసు మూగదేగాని బాసుండది దానికి
సెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇది
ఎద మీద ఎద పెట్టి సొదలన్నీ ఇనుకో
ఇనుకొని బతుకును ఇంపుగా దిద్దుకో … ముద్దబంతి ..
3rd Interlude
మపదా మపదా మపదా మపా గమా
గమపా మగమా రిసరి మగరిస దని దగా రిగాస
మూడవ చరణం
ముక్కోటి దేవుళ్ళూ మురిసి సూస్తుంటారు
ముందు జనమ బంధాలు ముడి ఏసి పెడతారు
కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపు తీపి దీవెనలు
మూగమనసు బాసలు మీ కిద్దరికి సేసలు … ముద్దబంతి ..
---------------------------------------------------------------------------------------------------------------------
Source : www.eemaata.com

Saturday, December 8, 2012

Abheri Raagam

అభేరి  రాగం
(Source : www.eemaata.com)
              మన సంగీతంలో రాగాల ప్రాధాన్యత గురించి రెండు మాటలు చెప్పుకోవాలి. భారతీయ సంగీతం, రాగాలు ఒకటి విడిచి మరొకటి లేదు! హిందూస్తానీ సంగీతం కాని, కర్ణాటక సంగీతం కాని, గాత్రం కాని, వాయిద్యాలపై కాని,ఆలాపన, ఖయ్యాల్‌, కీర్తన ఏదైనా కాని సంగీతంలో ఆనందానికి మూలకారణం రాగం. ఆలాపనలో ఏ సాహిత్యం లేకపోయినా, ఖయ్యాల్‌, పల్లవిలలో సాహిత్యం కొంత మాత్రమే ఉన్నా, భజనల్లోనూ, కీర్తనల్లోనూ ఎంతో సాహిత్యం ఉన్నా రాగాల ద్వారానే రసికులైన శ్రోతలను ఆకట్టుకోవటం జరుగుతుంది.ఏ రాగానికైనా ఆరొహణలోకాని, అవరోహణలో కాని కనీసం ఐదు స్వరాలకి తక్కువ కాకుండా రాగాన్ని నిర్వచిస్తారు. అయితే, సంగీతంలో భావం లేకుండా, స్వరాలు మాత్రం నిర్దుష్టంగా పలికించినంత మాత్రాన రాగ స్వరూపాన్ని తెలియ చెప్పలేరు. అందుకే, రాగం యొక్క భావాన్ని నరనరాల్లోనూ జీర్ణించుకొంటే తప్ప, రాగ స్వరూపం అర్ధం కాదు. కొత్తగా సంగీతం మీద అభిరుచి పెంచుకొనేవారికి అందుకే రాగం అర్ధం కావటానికి సమయం పడుతుంది. సంగీతంపై అభిమానం,అభిరుచి ఉన్నవారు, వీలు కలగ జేసుకొని ప్రఖ్యాత సంగీత విద్వాంసుల కచ్చేరీకి వెళ్ళి వినటం చూస్తే, సంగీతం గురించి తెలియని వారికి అదొక వేలం వెర్రిలా అనిపిస్తుంది కానీ సంగీత ప్రియులకి ఇలా వినటం ఒక అవసరం.
                ఈ వ్యాసాల ద్వారా రాగాలను పరిచయం చెయ్యటంలో చాలా వివరాలు వదిలేయటం జరిగింది. ఉదాహరణకు, సంగీతంలో ఒక ముఖ్యభాగమైన “తాళం” గురించి చెప్పలేదు! అలాగే కొన్ని సాంకేతిక వివరాలు కావాలనే వదిలేసాను. అందుకు ముఖ్య కారణం, శ్రోతపాఠకులకు musicology వివరాలవల్ల అసలు విషయం మరుగున పడిపోతుందన్న భయం వల్ల కొంత, సులభ శైలిలో సంగీతాన్ని పరిచయం చెయ్యాలనే తాపత్రయం వల్ల కొంత, మొత్తం మీద కావాలనే చాలా వివరాలు వదిలేసాను. ఉత్సాహం, ఆసిక్తి ఉన్నవారు ఆ వివరాలు తామే తెలుసుకొనే ప్రయత్నం చేస్తారని నా ఆశ.)
అభేరి రాగం ఆధారంగా / దగ్గరగా ఉన్న కొన్ని పాటలు, పద్యాలు
1. ఊరకే కన్నీరు నింప కారణ మేమమ్మా… (లవకుశ)
2. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని… (గులేబకావళి కధ) 3. నా కంటి పాపలో నిలిచి పోరా… (వాగ్దానం) 4. వెన్నెల లోని వేడిమేలనో వేడిమిలోని హాయి ఏలనో… (పెళ్ళినాటి ప్రమాణాలు) 5. చల్లగ చూడాలి పూలను అందుకుపోవాలి… (పెళ్ళినాటి ప్రమాణాలు) 6. రాగమయి రావే అనురాగమయి రావే… (జయభేరి) 7. చిగురాకులలో చిలకమ్మా… (దొంగ రాముడు) 8. కలవరమాయే మదిలో నా మదిలో… (పాతాళ భైరవి) 9. నీవేనా నను పిలచినది నీవేనా నను తలచినది… (మాయా బజార్‌) 10. ఓ నెల రాజా వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని నాకేనోయ్‌.. (భట్టి విక్రమార్క) 11. నీ లీల పాడెద దేవా… (మురిపించే మువ్వలు) 12. నీలి మేఘాలలో గాలికెరటాలలో… (బావా మరదళ్ళు) 13. ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు… (మల్లీశ్వరి మొదటి చరణం మాత్రమే) 14. రావోయి చందమామ మావింత గాధ వినుమా… (మిస్సమ్మ) 15. తెలిసిందిలే తెలిసిందిలే నెల రాజ నీరూపు తెలిసిందిలే… (రాముడుభీముడు) 16. ప్రేమ యాత్రలకు బృందావనము నందన వనమూ ఏలనో… (గుండమ్మ కధ) 17. నిన్న కనిపించింది నన్ను మురిపించింది… (రాణి రత్నప్రభ) 18. సడి సేయకోగాలి సడి చేయబోకే… (రాజ మకుటం) 19. నీవే నీవే నిన్నే నిన్నే… (ఇంటికి దీపం ఇల్లాలు) 20. ఉయ్యాల జంపాల లూగరావయా… (చక్రపాణి) 21. పదిమందిలో పాట పాడినా… (ఆనంద నిలయం) 22. కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో… (అప్పుచేసి పప్పుకూడు) 23. కళ్లు మూసుకొని వళ్ళు చూసుకొని కాలం గడపకు… (ప్రైవేటు రికార్డ్‌) 24. రావోయి బంగారి మామా నీతోటి రాహస్య మొకటున్నదోయి… (ప్రైవేటు రికార్డ్‌) 25. హాయమ్మ హాయి మా పాపాయి… (ప్రైవేటు రికార్డ్‌ ) 26. బంగారు పాపాయి బహుమతులు పొందాలి… (ప్రైవేటు రికార్డ్‌) 27. కనుల దీపికలుంచి మనసు వాకిలి తెరచి… (ప్రైవేటు రికార్డ్‌) 28. క్రొంజికురాకు వ్రేళుల కురుల్‌ తడియార్చుచు… (ప్రైవేటు రికార్డ్‌ పద్యం) 29. ఓహో మేఘమాలా నీలాల మేఘమాల… (భలే రాముడు) 30. తెలవారదేమో స్వామీ (శ్రుతిలయలు)
                        మన సంగీతంలో మరొక ప్రసిద్ధ రాగం అభేరి. క్రిందటి వ్యాసంలో పరిచయం చేసిన మోహనం రాగం లాగే అభేరి కూడా నిర్దుష్టమైన రూపం, రసం ఉన్న రాగం. కరుణ, భక్తి రసాలు ప్రధానంగా ఉన్న ఈ రాగంలో సృజన ( creativity ) కి అవకాశం ఎక్కువ.
స్వరస్థానాలు పరిచయం
         క్రిందటి వ్యాసంలో పరిచయం చేసిన మోహనం రాగానికి ఇచ్చినట్టే ఈ వ్యాసంలో కూడా అవసరమైన స్వరస్థానాలు మళ్ళీ అలాగే ఇస్తున్నాను. ఏదైనా ఒక రాగం గురించి తెలుసుకొని, గుర్తు పెట్టుకోవాలంటే, స్వర జ్ఞానం అవసరం. సప్త స్వరాలైన ” స, రి, గ, మ, ప, ద, ని ” స్వరాలలో మూల స్వరాలైన “స, ప” లను మినహాయిస్తే, మిగిలిన ఐదు స్వరాలకి ఒక్కొక్క స్వరానికి రెండు స్వర స్థానాలున్నాయి. అందువల్ల, సప్త స్వరాలకి 12 స్వర స్థానాలున్నాయి. అవి వరుసగా,
స్వరము కర్ణాటక పద్ధతి హిందూస్తానీ పద్ధతి
సంకేతము స షడ్జమం షడ్జ స రి శుద్ధ రిషభం కొమల్‌ రిషభ రి 1 రి చతుశ్రుతి రిషభం తీవ్ర రిషభ రి 2 గ సాధారణ గాంధారం కొమల్‌ గాంధార గ1 గ అంతర గాంధారం తీవ్ర గాంధార గ2 మ శుద్ధ మధ్యమం కోమల్‌ మధ్యమ మ1 మ ప్రతి మధ్యమం తీవ్ర మధ్యమ మ2 ప పంచమం పంచమ ప ద శుద్ధ ధైవతం కోమల్‌ ధైవత ద 1 ద చతుశ్రుతి ధైవతం తీవ్ర ధైవత ద 2 ని కైశిక నిషాధం కోమల్‌ నిషాద ని 1 ని కాకలి నిషాధం తీవ్ర నిషాద ని 2
మొత్తం పన్నెండు స్వరాలని వరుసగా ” స, రి 1, రి 2, గ 1, గ 2, మ 1, మ 2, ప, ద 1, ద 2, ని 1, ని 2 ” గా వ్రాసినట్టయితే, అభేరి ఉపయోగించే స్వరాలు ” స, రి2, గ 1, మ1, ప, ద 2, ని1 “. ఇది ఔడవ సంపూర్ణ (ఐదు ఏడు స్వరాల) రాగం. అంటే, ఆరొహణలో ఐదు స్వరాలు, అవరోహణలో ఏడు స్వరాలు ఉపయోగించే రాగం. ” స గ మ ప ని స స ని ద ప మ గ రి స ” లాగా ఉపయోగించే రాగం.
ఇంతకుముందు చెప్పినట్టు, మొత్తం 12 స్వరస్థాయిలని దృష్టిలో పెట్టుకొని చూస్తే, హార్మోనియం పై అభేరి రాగాన్ని ఈ క్రింది విధంగా పలికించ వచ్చు.
ఆరోహణ స X X గ1 X మ1 X ప XX ని1 X స
అవరోహణ స X ని1 ద2 X ప X మ1 X గ1 రి2 X స
ఆరోహణలో “స” నుంచి “గ” కు వెళ్ళేటప్పుడు, తిన్నగా “గ” కు వెళ్ళకుండా “స” నుంచి ముందు “మ” చేరి క్షణ కాలంలో “గ” ను చేరాలి. అలాగే, “ప” నుంచి “ని” చేరేటప్పుడు ముందు “స” చేరి క్షణ కాలంలో “ని” చేరాలి. అంటే, ఆరోహణని ఈ విధంగా పలకాలి. “స, మగ, మప, సని, సా”.
అదేవిధంగా, అవరోహణలో “స, సనినీ, నిద దపా, పమ, మగగా గరి,రిసా” లాగా పలకాలి.
శ్రీ కొడుకుల శివరాం ఇచ్చిన ఈ ఆరోహణ, అవరోహణ వినండి! మన కర్ణాటక సంగీతం పద్ధతిలో ఇక్కడ మొదలైన “స” స్వరం శ్రుతి “ఒకటి”. అదే, వెస్టర్న్‌ కీబోర్డ్‌ పద్ధతిలో, ” C” scale కి సమానం. అవకాశం ఉన్నవారు ఈ స్వరాలు వింటూ, కీబోర్డ్‌ మీద స్వరాలు ఇలాగే పలికించండి.
కర్ణాటక సంగీతంలోని 20వ మేళకర్త “నట భైరవి” నుంచి జనించిన రాగం అభేరి. మహ మహోపాధ్యాయ డా. నూకల చినసత్యనారాయణ ” రాగ లక్షణ సంగ్రహం” పుస్తకంలో రాసిన ప్రకారం, 50 ఏళ్ళ క్రితం ఈ రాగం శుద్ధ ధైవతం (హిందూస్తానీలో కోమల్‌ దైవతం) లో పాడేవారట! రాను రాను చతుశ్రుతి ధైవతం (హిందూస్తానీలో తీవ్ర దైవతం) ఉపయోగించటం వల్ల రాగం వినటానికి ఆహ్లాదంగా ఉండటం గుర్తించిన తరువాత, అభేరిలో చతుశ్రుతి ధైవతం స్థిరపడి పోయింది.ఇప్పుడు ప్రచారంలో ఉన్న ” నగుమోము కనలేని..” అన్న ప్రసిద్ధ త్యాగరాజ కృతి (కర్ణాటక సంగీతంలో
త్రిమూర్తులలో ఒకరైన శ్రీ త్యాగరాజు, అభేరి రాగంలో ఈ ఒక్క కృతి తప్ప మరే కృతులు మనకివ్వలేదు!), మొదట ప్రవేశ పెట్టిన పద్ధతి కన్నా, హిందీస్తానీ సంగీతంలో అభేరికి దగ్గరైన భీంపలాస్‌ రాగానికి దగ్గరగా ఉంటూంది. ఈ నాడు ప్రచారంలో ఉన్న అభేరి రాగంలోని స్వరాల ప్రకారం, అభేరి 22వ మేళ కర్త అయిన “ఖరహర ప్రియ” కు జన్య రాగంలా అనిపిస్తుంది.
అందువల్ల, హిందూస్తానీ సంగీతంలోని ధన్యాసి, భీంపలాస్‌ రాగాలు అభేరి పాత,కొత్త పద్ధతుల్ని వరుసగా పోలి ఉంటాయి.
పైన చెప్పిన అభేరి రాగంలోని మార్పు, కాలక్రమంలో రాగాలలో వచ్చిన మార్పులకి ఒక ఉదాహరణ మాత్రమే! నిజానికి కొన్ని వందల ఏళ్ళ క్రిందట ప్రచారంలొ ఉన్న రాగాలు ఇప్పుడు లేవు. కాలానుగుణంగా కొన్ని రాగాలు మరుగున పడినా, సృజనాత్మకత కలిగిన విద్వాంసుల వల్ల, మరి కొన్ని కొత్త రాగాలు మన సంగీతంలో చోటు చేసుకొని సుసంపన్నం చేసాయి. పట్‌దీప్‌,చంద్రకౌన్స్‌, మారుబేహాగ్‌, కళావతి, మధువంతి, శివరంజని వంటి రాగాలు హిందుస్తానీ సంగీతంలో మొన్నమొన్ననే వచ్చిన కొన్ని కొత్త రాగాలు. ఒక వేళ అప్పుడూ, ఇప్పుడూ కూడా చాలా పాప్యులర్‌ అయిన అభేరి వంటి రాగాలు ఉన్నా, ఇందాక చెప్పినట్టు ఈ రాగాలు కాలంతో మారాయి. ఈనాడు మనకున్న రికార్డింగ్‌ సౌకర్యం వల్ల, ఇప్పుడు ప్రచారంలో ఉన్న రాగాలు, వాటి లక్షణాలు మనం రికార్డ్‌ చేసి ముందు తరాలవారి కోసం దాచి ఉంచే వీలు మనకుంది. కానీ, మొన్న మొన్నటి
దాకా ఇటువంటి వీలు లేక పోవడం వల్ల, సంగీతం నేర్పే విద్వాంసులు,వీలైనంత వరకు యధాతధంగా ఒక తరం నుంచి మరొక తరానికి, పూర్తిగా సాధన, జ్ఞాపక శక్తి మీద ఆధారపడి, సంగీతాన్ని పరంపరలుగా నిలుపుతూ వచ్చారు. ఇదే మన సంగీతంలోని సాంప్రదాయం! సహజంగా ఇటువంటి ప్రయత్నాలలో సంగీతం చాలా మార్పులు చెందే అవకాశం ఉండడంవల్ల, సంగీత విద్వాంసులు నిర్దిష్టమైన సంగీత సాంప్రదాయాలను అనుసరించి, సద్గురుశిష్య పరంపరలుగా విద్యను యధాతధంగా మనకు అందించటం జరిగింది.
హిందూస్తానీ సంగీతంలో…
కర్ణాటక రాగం “అభేరి” కి హిందూస్తానీ సంగీతంలో దగ్గరైన రాగం “భీంపలాస్‌”. క్రిందటి వ్యాసం “మోహనం” లో ఇచ్చిన, హిందూస్తానీ, కర్ణాటక పద్ధతుల్లోని పోలికలు తేడాలతో పోలిస్తే, అభేరి, భీంపలాస్‌ రాగాలు ఒకటికి మరొకటి చాలా దగ్గరగా ఉంటాయి. భీంపలాస్‌ రాగం, “భీం”,”పలాస్‌” అన్న రెండు రాగాల కలయిక అంటారు కొంతమంది. మరికొందరు, ఈ రాగం
అసలు పేరు “పలాస్‌”, దానికి భీమ్‌ అన్న విశేషణం తరవాత కలిపారు అంటారు ( ఈ రాగం గొప్పది కాబట్టి, శంకరాభరణం రాగాన్ని ధీరశంకరాభరణం అన్నట్టు, “పలాస్‌” కి ముందు “భీమ్‌” అన్నది కలిపారని కొందరి వాదన). హిందూస్తానీ సంగీతంలో చాలా ప్రాచుర్యం పొందిన ఈ భీంపలాస్‌ రాగం,మరాఠీ స్టేజి మీద చాలా ముఖ్యమైన రాగం. అభేరి రాగానికి ఉన్నట్టుగానే భీంపలాస్‌ రాగానికి కూడా ఆరోహణఅవరోహణ “స గ మ ప ని స స ని ద ప మ గ రి స”. ఈ రాగానికి వాది స్వరం “మ”, సంవాది “స”. కర్ణాటక పద్ధతిలో వాదిసంవాదిల ప్రసక్తి ఉన్నా, వీటిని ఎక్కువగా ఉపయోగించుకున్నట్టు కనపడదు. భీంపలాస్‌ రాగం “ని స మ” అన్న స్వరాలతో మొదలు పెట్టటం చాలా విన సొంపుగా ఉంటుంది. “మ గ” అన్న సంగతి వాడకం ఈ రాగంలో ఎక్కువ. భీంపలాస్‌ పకడ్‌ (స్వరాల గుంపు) ఈ విధంగా ఉంటుంది.
ని స మ S S మ ప గ మ గ రి స
పైన చెప్పిన పకడ్లో S అన్న గుర్తు దీర్ఘ స్వరాన్ని తెలియచేస్తుంది.అంటే, “ని స మ” అన్నప్పుడు “మ” మీద దీర్ఘం తీయటం వల్ల, “ని స మా”గా మారుతుంది. భీంపలాస్‌ పూర్వాంగ రాగం. మొత్తం పన్నెండు స్వరస్థానాలని రెండు గ్రూప్‌లుగా విడకొట్టి, స నుంచి ప వరకు ఒక గ్రూప్‌, ప నుంచి పై స వరకు రెండవ గ్రూప్‌ అనుకుంటే, ఏ రాగంలో స్వరాల సంచారం మొదటిగ్రూప్‌ మీద ఎక్కువగా ఉంటుందో అది పూర్వాంగ రాగం. రెండో గ్రూప్‌ మీద ఆధారపడేది ఉత్తరాంగ రాగం అవుతుంది.
సినిమా పాటల పరిచయం ముందు, ప్రముఖ హిందూస్తానీ సంగీత విద్వాంసుడు స్వర్గీయ మల్లికార్జున్‌ మన్సూర్‌ పాడిన ఈ భీంపలాస్‌ రాగం వినండి. మొత్తం 30 నిమిషాలుకు పైగా సాగే ఈ గానం, ఈమాట పాఠశ్రోతలకు ఒక ఉదాహరణగా ఈ రాగం ఛాయల్ని వినిపించటం కోసం, ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఇస్తున్నాం! శాస్త్రీయ సంగీతం వినటం ఎక్కువగా అలవాటు లేనివారికి ఒక సూచన. సినిమా పాటలు, ఇతర లలిత గీతాలూ ఇచ్చినంత తొందరగా ఆనందం శాస్త్రీయ సంగీతం ఇవ్వదు కాబట్టి, ప్రశాంతంగా ( inhibitions ఏమీ లేకుండా)ఈ రాగం వినండి. వినగా, వినగా మీ మనస్సుల్లో అభేరి లేకపోతే భీంపలాస్‌ రాగాల్లో బాణీలు కట్టిన ఎన్నో పాటలు గుర్తుకు వస్తాయి. కొంచెం రాగాలతో పరిచయమున్నవారుి, ఇక్కడ ఇచ్చిన రాగాలాపనలో, రాగం ఎలా evolve అవుతుందో గమనించగలుగుతారు. నెమ్మదిగా మంద్ర స్థాయిలో మొదలు పెట్టిన ఈ గానం, రాను రాను రాగాలాపనలోనూ, గమనంలోనూ వేగం పుంజుకొని మిమ్మల్ని ఎక్కడకో లాక్కుపోతుంది. ఇలాంటి ఉదాహరణల వల్ల సినిమాపాటలకి,శాస్త్రీయ సంగీతానికి ఉన్న తేడాలు, పోలికలు కూడా తెలుస్తాయి. స్వర్గీయ మన్సూర్‌ గొంతులో ఒకరకమైన “జీర” మొదట మీకు వినిపించినా, త్వరగా అది మీరు మర్చిపోయి రాగంలో పడిపోతారు!
సినిమా పాటలు
తెలుగు సినిమా పాటల్లో, కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి అతి దగ్గరగా బాణీ కట్టి, పాప్యులర్‌ అయిన పాట, శ్రీమతి ఎస్‌. జానకి మురిపించే మువ్వలు సినిమాకోసం పాడిన “నీ లీల పాడెద దేవా..” అన్న పాట. ఈ పాట ఇప్పటికీ తెలుగు వారి నాలుకల మీద ఆడుతూనే ఉంది. తమిళంలో కూడా ఈ పాట గొప్ప ప్రజాదరణ పొందింది. శ్రీమతి జానకి గొంతు ఈ పాటకి ఎంత బాగా సరిపోయిందో,గాత్రానికి మించి సన్నాయి పై సహకారం అందించిన శ్రీ కరైక్కుడి అరుణాచలం వాద్య సహకారం అంత కంటే ఇంకా చక్కగా ఉంది. పాట మొదట్లో జానకి గొంతు, నాదస్వరం స్వరం విడివిడిగా గుర్తు పట్టగలిగినా, పాటలో వేగం పెరిగిన
తరువాత, గాత్రంనాదస్వరం ఒక్కసారే వినిపిస్తున్నపుడు, ఈ రెంటికీ తేడా తెలియకుండా పోతుంది.
తెలుగువారి మధుర గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల చాలా సినిమాల్లో అభేరి రాగాన్నివాడటమే కాకుండా, ప్రైవేటు రికార్డుల్లో స్వరం ఇచ్చిన పాటల్లో “రావోయి బంగారి మామా నీతోడి రాహస్య మొకటున్నదోయి..” అన్న పాట అభేరి రాగంలో కట్టినదే! పాట వింటూ ఉంటే, ఒక పల్లెటూరి వాతావరణం సంగీతంలో సృష్టి చేసాడు ఘంటసాల.మూడవచరణం లో మొదలైన “ఏటి పడవ సరంగు పాట గిరికీలలో….” తరవాత వచ్చే గమకాలు, ఆలాపనలో లలితంగా ఒక folk tune వినిపించటమే కాకుండా, సుశాస్త్రీయంగా కూడా అభేరి రాగానికి న్యాయం చేకూర్చాడు. సాహిత్యంలో ఇది అచ్చంగా ఒక తెలుగుపాట. సంగీతంలోనూ ఇది అంతకంటే మరీ అచ్చమైన తెలుగు పాట.
గుండమ్మ కధ సినిమాలో ఎన్నో పాటలు పాప్యులర్‌ అయ్యాయి. “ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో..” అన్నపాట తెలియని తెలుగువారు బహుశా ఉండరేమో! ఒక పాట బాణీ కాపీ కొట్టి మరొక పాటలో వాడుకున్న సందర్భాలు
మన సినిమా పాటల్లొ ఎన్నో ఉన్నాయి. కానీ, ఇళయ రాజా డిటెక్టివ్‌ నారద అన్న సినిమాలో ఈ పాటను పూర్తిగా ఉపయోగించుకుంటూనే “యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా ..” అని చిత్ర గొంతుతో మొదలయ్యే ఈ పాట ఒక అద్భుత సృష్టి. ఇళయరాజా creativity మళ్ళీ ఈ పాటలొ మరోసారి చూపించాడు. ఈ పాటలో వాడుకున్న వాయిద్యాలు, వాటి ఆర్కెస్ట్రేషన్‌ మళ్ళి ఇంకోసారి వినండి.
అభేరి రాగంలో ఆరోహణ స్వరాల్ని అలాగే వాడుతూ, అవరోహణలో మాత్రం “ద,రి” లను వాడకుండా,అంటే అరోహణలోనూ అవరోహణలోను కూడా “స గ మ ప ని” స్వరాలనే వాడుతూ శ్రీమతి లీలచే పాడిచిన దేవులపల్లి సాహిత్యం “సడిసేయకో గాలి సడి చేయబోకే ..” అన్న పాటను రాజమకుటం సినిమాకోసం మాస్టర్‌ వేణు స్వరపరిచాడు. పాట మొదలవుతూనే వినే ఆలాపన ఎంత అద్భుతంగా ఉందో, చరణాల మధ్య వచ్చే క్లారినెట్‌ వాయిద్యం అందుకు సమానంగా ఉంది.
ఈ పాట శ్రద్ధగా వింటే, అభేరి రాగ లక్షణాలు ఈ పాటలో తక్కువగా వినపడ్తాయి. అందుకు ముఖ్యకారణం, ఇందాకా చెప్పినట్టు “రి, ద” లను వాడకపోవటమే! ఈ పాటలోని సాహిత్యం సంగతి సరే సరి! శ్రీమతి లీల పాడిన “ఆనాటి” పాటల లిస్టు ఎవరన్నా తయారు చేస్తే, ఆ లిస్టులో ఈ పాట తప్పకుండా ముందు ఉండాల్సిన పాట.
చివరిగా, “ఈనాటి” పాటల్లో అభేరిలో స్వరం చేసిన ఒక పాటతో ఈ వ్యాసం ముగిస్తాను. శ్రుతిలయలు సినిమా కోసం కె. వి. మహాదేవన్‌ సంగీతం ఇచ్చిన “తెలవారదేమో స్వామీ..” అన్న పాట అభేరిలో స్వరపరచిందే! పాట వింటూ ఉంటే “నగుమోము కనలేని..” అన్న త్యాగరాజ కీర్తన ఛాయలు కనపడతాయి.ఈ పాట గురించి ఎక్కువ చెప్పక్కరలేదు. ఎందుకంటే, సినిమా సంగీతంలో ఎన్నో గొంతులు వినిపిస్తూ ఉన్నా, జేసుదాసు గొంతుకి ఒక ప్రత్యేకత ఉంది.శాస్త్రీయ సంగీత జ్ఞానంతో పాటు, లలిత సంగీతం, వీటన్నిటికీ మించి ఏ సంగీతాన్నయినా “సంగీతం”గా వినిపలికించగలిగే గొంతు జేసుదాస్‌ది! ===============================================================
Source : www.eemaata.com

Mohana Raagam

మోహన రాగం
మోహన రాగం ఆధారంగా ఉన్న కొన్ని పాటలు, పద్యాలు 1. లాహిరి లాహిరి లాహిరిలో… (మాయాబజార్‌) 2. చెంగు చెంగునా గంతులు వేయండి… (నమ్మిన బంటు) 3. ఎచటనుండి వీచెనో… (అప్పుచేసి పప్పుకూడు) 4. మనసు పరిమళించెను… (శ్రీ కృష్ణార్జున యుద్ధం) 5. అయినదేమో అయినది ప్రియ… (జగదేకవీరుని కధ) 6. మోహన రాగమహా మూర్తిమంత మాయే… (మహా మంత్రి తిమ్మరసు) 7. వే వేలా గొపెమ్మలా మువ్వా గోపాలుడే… (సాగర సంగమం) 8. పాడవేల రాధికా… (ఇద్దరు మిత్రులు) 9. వినిపించని రాగాలే కనిపించని… (ఆరాధన) 10. నను పాలింపగ నడచి వచ్చితివా… (బుద్ధిమంతుడు) 11. ఘనా ఘన సుందరా… (చక్రధారి) 12. సిరిమల్లే నీవె విరిజల్లు కావే… (పంతులమ్మ) 13. మదిలో వీణలు మ్రోగె… (ఆత్మీయులు) 14. నిన్ను కోరి వర్ణం… (ఘర్షణ) 15. మధుర మధురమీ చల్లని రేయీ… (విప్రనారాయణ) 16. మదిలోని మధుర భావం… (జయసింహ) 17. ఈనాటి ఈహాయి కలకాదోయి… (జయసింహ) 18. నల్లవాడే వ్రేపల్లె వాడే… (చిరంజీవులు) 19. తెల్ల వార వచ్చె తెలియక నా స్వామి… (చిరంజీవులు) 20. మౌనముగా నీ మనసు పాడినా… (గుండమ్మ కధ) 21. తెలుసుకొనవె యువతీ అలా నడచుకొనవె… (మిస్సమ్మ) 22. చందన చర్చిత నీల కళేబర… (తెనాలి రామకృష్ణ) 23. ఆ మొగల్‌ రణధీరులు… (ప్రైవేటు రికార్డ్‌ పద్యం) 24. భారతీయుల కళా ప్రాభవమ్ము లిఖించి… (ప్రైవేటు రికార్డ్‌ పద్యం) 25. కనులకు వెలుగువు నీవే కాదా… (భక్త ప్రహ్లాద) 26. శివ శివ శంకరా… (భక్త కన్నప్ప) 27. జ్యోతి కలశ… (భాభీ కీ చుడియా) 28. ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో… (అమరశిల్పి జక్కన్న) 29. పులకించని మది పులకించు… ( పెళ్ళికానుక) 30. తిరుమల గిరి వాసా… (రహస్యం)           తెలుగు పాటల్లో మోహన రాగం వినిపించినంత విస్తృతంగా మరో రాగం వినపడదేమో! దీనికి ముఖ్య కారణం ఈ రాగంలో వినిపించే (వినిపించగలిగే) రకరకాలైన అనుభూతులు. స్వర పరంగా మోహన రాగం ఐదు స్వరాల (స, రి, గ, ప, ద) రాగమైనప్పటికీ, మోహనం ఇవ్వగలిగే abstractness వల్ల, సంగీతపరంగా చూపే లోతులలో ఉన్న వైవిధ్యాల వల్ల, శాస్త్రీయ సంగీతంలో ఈ రాగానికి ఒక విశిష్ట స్థానముంది. మన కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోని మోహనం రాగానికి “దగ్గరగా” ఉండే రాగం హిందూస్తానీ శాస్త్రీయ సంగీతంలో “భూప్‌”. స్వర పరంగా ఈ రెండు రాగాలు ఒకటే అయినప్పటికీ, శాస్త్రీయ సంగీతంలో పరిచయంఉన్న వారు ఈ రెంటినీ రెండు విభిన్న రాగాలుగా పేర్కొంటారు. మోహనం చాలా అవకాశం గల రాగం. (పైన మోహనం రాగంలో ఉన్న కొన్ని పాటల, పద్యాల లిస్టు చూస్తే, మోహనం ఎంత అవకాశం గల రాగమో అర్ధమవుతుంది. ) ఈ ప్రసిద్ధ రాగానికి నిర్దుష్టమైన రూపం, రసం, భావం ఉన్నాయి. (ప్రతి రాగానికి తనదంటూ ఒక ప్రత్యేకత ఉన్నా, మోహనం వంటి నిర్దుష్టమైన రాగాలు మన సంగీతంలో కొన్ని మాత్రమే ఉన్నాయి.) అన్నివేళలా పాడటానికి అనువైన ఈ రాగం శృంగార, భక్తి, శాంత, వీర రస ప్రధానమైనది. తక్కువ స్వరాలే ఉన్నా ఎక్కువ రక్తి కలిగి శ్రోతలకు సులభంగా అర్ధమవుతుంది. మిగిలిన రాగాలతో పోలిస్తే, మోహనం విని ఆనందించటం సులభం. పాడటం సులభం. స్వరస్థానాలు పరిచయం ఏదైనా ఒక రాగం గురించి తెలుసుకొని, గుర్తు పెట్టుకోవాలంటే, స్వర జ్ఞానం అవసరం. సప్త స్వరాలైన ” స, రి, గ, మ, ప, ద, ని ” స్వరాలలో మూల స్వరాలైన “స, ప” లను మినహాయిస్తే, మిగిలిన ఐదు స్వరాలకి ఒక్కొక్క స్వరానికి రెండు స్వర స్థానాలున్నాయి.అందువల్ల, సప్త స్వరాలకి 12 స్వర స్థానాలున్నాయి. అవి వరుసగా, స్వరము కర్ణాటక పద్ధతి హిందూస్తానీపద్ధతి సంకేతము స షడ్జమం షడ్జ స రి శుద్ధ రిషభం కోమల్‌ రిషభ రి 1 రి చతుశ్రుతి రిషభం తీవ్ర రిషభ రి 2 గ సాధారణ గాంధారం కోమల్‌ గాంధార గ1 గ అంతర గాంధారం తీవ్ర గాంధార గ2 మ శుద్ధ మధ్యమం కోమల్‌ మధ్యమ మ1 మ ప్రతి మధ్యమం తీవ్ర మధ్యమ మ2 ప పంచమం పంచమ ప ద శుద్ధ ధైవతం కోమల్‌ ధైవత ద 1 ద చతుశ్రుతి ధైవతం తీవ్ర ధైవత ద 2 ని కైశిక నిషాధం కోమల్‌ నిషాద ని 1 ని కాకలి నిషాధం తీవ్ర నిషాద ని 2 మొత్తం పన్నెండు స్వరాలని వరుసగా ” స, రి 1, రి 2, గ 1, గ 2, మ 1, మ 2, ప, ద 1, ద 2, ని 1, ని 2 ” గా వ్రాసినట్టయితే, మోహనం ఉపయోగించే స్వరాలు ” స, రి 2, గ 2, ప, ద 2, “. ఇది ఔడవ (ఐదు స్వరాల) రాగం. అంటే, ఆరోహణలోనూ, అవరోహణలోనూ కూడా ఐదు స్వరాలు ” స రి గ ప ద స స ద ప గ రి స ” లాగా ఉపయోగించే రాగం. కానీ, రాగంలో స్వరాలు ఇదే పద్ధతిన ఒకదాని వెంట మరొకటి రానవసరంలేదు. ఉదాహరణకు, “రి” తరువాత “గ”, “గ” తరువాత “ప” అదే వరుస క్రమంలో రానక్కరలేదు. అంతే కాకుండా, స్వరాలు పలికించినంత మాత్రాన సంగీతం రాదు! ఒక ప్రసిద్ధ సంగీతకారుడు చెప్పినట్టు, రెండు పక్క పక్క స్వరాల మధ్య ఉన్న నిశ్శబ్దాన్ని సూచించేదే సంగీతం. మామూలు పరిభాషలో చెప్పాలంటే, discrete స్వరాలు పలికిస్తే సంగీతం రాదు. దీనికి కారణం, పైపై కనిపించే స్వరాలకన్న లోతుగా నిర్ణయమయ్యేదే రాగం! ఇంతకుముందు చెప్పినట్టు, మొత్తం 12 స్వరస్థాయిలని దృష్టిలో పెట్టుకొని చూస్తే, హార్మోనియం పై మోహనం రాగాన్ని ఈ క్రింది విధంగా పలికించ వచ్చు. స X రి2 X గ2 XX ప X ద2 XX స ఉత్తినే స్వరాలు పలికిస్తే సంగీతం రాదు కాబట్టి, కొత్తగా నేర్చుకొనే వారు ఏదైనా పాట గాని, స్వరాలు తెలిసిన గీతం, వర్ణం గాని సాధన చేస్తే మోహనం రాగం అలవాటవుతుంది. ” X ” వాడినచోట స్వరాలు నిషిద్ధం ఈ రాగంలో! అంటే, “రి1, గ1, మ1, మ2, ద1, ని1, ని2″ లు శుద్ధ మోహనంలో ఉపయోగించ కూడని స్వరాలన్నమాట. హిందూస్తానీ సంగీతంలో… హిందూస్తానీ సంగీతంలో మోహనం అన్న రాగం లేదు. కానీ, మోహనంకి దగ్గరగా ఉండే ” భూప్‌” రాగం (కర్ణాటక పద్ధతిలోని “భూపాలం” రాగానికి, ఇక్కడ చర్చించే హిందూస్తానీ పద్ధతిలోని “భూప్‌” రాగానికీ సంబంధం ఏమీ లేదు) స్వరాలు, అరోహణఅవరోహణ సరిగ్గా మోహనం రాగంలో ఉన్నట్టుగానే ఉంటాయి.హిందూస్తానీ పద్ధతిలో రాగలక్షణాన్ని సూచించటానికి ” పకడ్‌ ” ఉపయోగిస్తారు. తేలిక మాటల్లో చెప్పాలంటే పకడ్‌ (లేదా స్వరాల గుంపు), రాగంలోని ఒక స్వరం నుంచి ఉన్న మిగిలిన స్వరాలకు ఎలా వెళ్ళాలో చెప్పే దారి అన్నమాట! హిందూస్తానీ పద్ధతిలో ఈ పకడ్‌ చాలా ముఖ్యమైనది. ” భూప్‌” రాగం ఉపయోగించే స్వరాల గుంపు లేక పకడ్‌ ఈ విధంగా ఉంటుంది. గ రి స ద స రి ప గ ద ప గ రి స పైన చెప్పిన పకడ్‌లో “స రి ప గ ” అన్న స్వరాలగుంపులో “స” నుంచి “రి” మీదుగా ( “గ” ని వాడకుండా) “ప” ను చేరి “గ” మీద ఆగటం గమనించండి. రాగ లక్షణాన్ని తీసుకు వచ్చేవి ఇలాంటి అతి ముఖ్యమైన వివరాలే! అలాగే, ఈ పకడ్‌లో మధ్య ఇచ్చిన “” గుర్తు, స్వరాల గుంపు మధ్య pause ని సూచిస్తుంది. ఈ విధంగా స్వరాల మధ్య ఆపటం కూడా మరొక ముఖ్యమైన విషయం. హిందూస్తానీ సంగీతంలో రాగం లక్షణం సూచించే మరొక ముఖ్యమైన ఉపకరణం ” వాది సంవాది”. అంటే, రాగంలోని రెండు ముఖ్యమైన స్వరాలను తీసుకొని, అందులో అతి ముఖ్యమైన స్వరాన్ని ” వాది” అని, రెండవ స్వరాన్ని ” సంవాది” అని పిలుస్తారు. ఈ రకంగా చేసే వర్గీకరణం వల్ల, రాగలక్షణం సులభంగా అర్ధమయ్యే వీలు ఉంది. సంగీతాన్ని మొదటిసారిగా వాయిద్యాలపై పలికించటానికి ప్రయత్నించే వారికి మోహన రాగం కొంత సులువుగా ఉంటుంది. మోహన రాగం హార్మోనియం లేదా కీబోర్డ్‌ మీద వాయించటం తేలిక. అలాగే వేణువు లాంటి వాయిద్యాల పై కూడా తేలికగా ఉంటుంది. కొన్ని కొన్ని రాగాలకు కొన్ని కొన్ని వాయిద్యాలు అతికినట్టు సరిపోతాయి. మోహన రాగానికి వేణువుకు ఉన్న సంబంధం అలాంటిదే. కర్ణాటక శాస్త్రీయ సంగీతం కొత్తగా నేర్చుకుంటున్న వారు తప్పకుండా నేర్చుకొనే ” వర వీణా మృదుపాణీ..” అన్న మోహన రాగం గీతం కూడా ఉత్సాహం ఉన్నవారు ప్రయత్నించవచ్చు. లలిత సంగీతంలో కూడా (సినీ గీతాలతో కలసి) మొహన రాగంలో స్వర బద్ధం చేసిన పాటలు అనేకం కనపడతాయి. చాలా మంది శ్రోత పాఠకులకు సినిమా పాటలతో ఎక్కువ పరిచయం ఉండే అవకాశం ఎక్కువ కాబట్టి, వీటిలోని అనేక వైవిధ్యాలున్న పాటలను మోహన రాగం పరిచయం చేయ్యటానికి ఎన్నుకున్నాను. సినిమా పాటల్లోకి దూకేముందు, ప్రఖ్యాత గాయకుడు శ్రీ మంగళంపల్లి బాల మురళీకృష్ణ పాడిన ” నను పాలింపగ నడచి వచ్చితివో…” అన్న త్యాగరాజ కృతి ఒక్క సారి గుర్తు చేసుకుందాం! మోహనరాగం లక్షణం ఏమిటో తెలియాలంటే, మీకు విసుగు వచ్చేదాకా ఇదే కృతి వినండి. సంగీతానికి ” బాగా వినడం” చాలా అవసరం.చాలా ఓపికగా, vocal music మాత్రమే కాకుండా instrumental music కూడా వినటం చెయ్యాలి. ఇలా వినగా వినగా రాగ లక్షణం వంట పట్టించుకొనే అవకాశం ఉంది. సినిమా పాటలు
ఇప్పుడు కొన్ని సినిమా పాటలు గురించి తెలుసుకుందాం. కొన్ని పాటలు పదే పదే వినటం వల్ల వాటిలోని మాధుర్యం మర్చిపోయే ప్రమాదముంది. అలాంటి పాటల్లో మాయాబజార్‌ సినిమాలోని ” లాహిరి లాహిరి లాహిరిలో…” పాట ఒకటి.శుద్ధ మోహన రాగంలోని స్వరాలు తప్ప మరే స్వరాలు ఉపయోగించకుండా, పడవ మీద షికారు పోతూ ప్రేమికులు పాడే పాట ఇది. మెల్లగా, వెన్నెల రాత్రి, చల్లగాలిలో ప్రయాణిస్తూ, మంద గమనంతో సాగే ఈ పాటలోని సంగీతాన్ని వినండి. పాటలోని సాహిత్యానికి తగ్గ రాగం. సాహిత్యానుభూతికి దీటైన సంగీతానుభూతి. ఈ పాటలోని స్వరాలను కొంచెం తేలికగా ఒక వాయిద్యంపై ప్రయత్నించి పలికించవచ్చు. ఉత్సాహం ఉన్నవారికి వీలుగా ఈ పాటలోని స్వరాలను, ఈ వ్యాసం చివర ఇచ్చాను. ఇద్దరు మిత్రులు సినిమాలోని ” పాడవేల రాధికా ..” మరొక ఉదాహరణ. శుద్ధ కర్ణాటక శాస్త్రీయ సంగీత పరంగా బాణీ కట్టి, వీణతో పలికించిన ఈ పాట, ఉత్సాహవంతులు వీణ మీద పలికించ ప్రయత్నిస్తే బాగుంటుంది.
               మోహన రాగంలో ప్రఖ్యాత సినీ సంగీత దర్శకుడు ఇళయ రాజా చేసిన అనేక ప్రయోగాల్లో, రెండు ఇక్కడ చెప్పుకోవాలి.మొదటిది “నిన్ను కోరి వర్ణం..” అన్న ఘర్షణ సినిమాలోని పాట. నిజానికి శుద్ధ కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో “నిన్ను కోరి వర్ణం..” అన్న మోహనం రాగం వర్ణం ఉన్నా, ఈ సినిమా పాట కొంచెం శాస్త్రీయ సంగీతాన్ని వెక్కిరించినట్లు కనపడుతుంది. కానీ, పూర్తిగా మోహన రాగం, ఆది తాళంలో స్వరపరచబడ్డ ఈ పాట వింటే, తెలిసిన మోహన రాగంలో ఎంతటి విలక్షణత తీసుకు రావచ్చో ఇళయ రాజా నిరూపించాడు. ఇలాంటి ప్రయోగాలు మన శాస్త్రీయ సంగీతం మీద మాత్రమే కాకుండా, వెస్టర్న్‌ మ్యూజిక్‌ మీద కూడా మంచి అధికారం ఉన్న ఇళయ రాజా లాంటి వారు మాత్రమే చెయ్యగలరు. రెండవ ఉదాహరణ ” వే వేలా గోపెమ్మలా…” అన్న సాగర సంగమం సినిమాలోని పాట. ఈ పాటకు మోహనం రాగాన్ని మూలంగా తీసుకున్నా, అన్య స్వరాలు అక్కడక్కడ ఉపయోగించటం వల్ల పాటకు ఒక కొత్త అందాన్ని తెచ్చాయి. “మోహనాల వేణువూదే..” అన్న చోట శుద్ధ ( హిందూస్తానీలో కోమల) ధైవతం వాడటం, పాటలో ఉన్న రెండు చరణాలకి మధ్య ఉన్నఇంటర్‌లూడ్స్‌లో వేణువుతో మొదలైన సంగీతంలో మోహనంలో వర్య్జమైన “కోమల్‌ గాంధారం”, “కోమల్‌ మధ్యమ” , “తీవ్ర నిషాధం” స్వరాలు ఉపయోగించటం లాంటి ప్రయోగాలు చెప్పుకోతగ్గవి.
             ఇంతకు ముందు చెప్పినట్టు, కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోని “మోహనం” రాగానికి ” దగ్గరగా” ఉండే రాగం హిందూస్తానీ శాస్త్రీయ సంగీతంలోని “భూప్‌” రాగం. “దగ్గరగా” అనటానికి కారణం ఉంది. స్వరాల దృష్య్టా ఈ రెండు రాగాలూ ఒకే రకంగా కనిపించినా, ఒకే రకంగా వినిపించవు! ఈ రెండు రాగాలూ తీసుకు వచ్చే అనుభూతులు వేరు వేరు. సాధన, అనుభవం ఉన్న వ్యక్తులకు ఈ రెండు రాగాల మధ్య ఉన్న పోలికలు, తేడాలు తెలుస్తాయి.అది మరీ అంత కష్టమైన పని కాదు. శ్రద్ధగా ఈ రెండు రాగాలలో కొన్ని పాటల్ని వింటే ఆ తేడాలను కనిపెట్టవచ్చు. “భూప్‌” రాగంలో స్వరపరచి, హిందీ సినిమా ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ పాడిన ” జ్యోతి కలశ.. కలశ చలకే” అన్న పాట, ఘంటసాల చక్రధారి సినిమా కోసం పాడిన ” ఘనా ఘన సుందరా..” అన్న పాట విని, ఇక్కడ ఉదహరించిన మోహనం లోని పాటలతో పోలిస్తే, ఈ “తేడా” ఏమిటో అర్ధమవుతుంది. గమ్మత్తుగా మోహనం రాగం స్వరాలు మాత్రమే ఉపయోగించే ఇంకొక హిందూస్తానీ రాగం “దేశ్‌కార్‌”. చిరంజీవులు సినిమా కోసం ఘంటసాల స్వరం ఇచ్చిన “తెల్ల వార వచ్చే తెలియక నా స్వామి..” అన్న పాట “దేశ్‌కార్‌” రాగం లోనిదే! మోహనం రాగానికి దగ్గరగా ఉండే ఈ “దేశ్‌కార్‌” రాగం సూర్యోదయ కాలంలో పాడుకొనే రాగం. షాహిద్‌ పర్వేజ్‌ సితార్‌పై పలికించిన ఈ దేశ్‌కార్‌ రాగం వినండి. చాలా చోట్ల మోహనం రాగం లాగా అనిపించే ఈ దేశ్‌కార్‌ రాగానికి వాది “ద” సంవాది ” గ”. ఇందుకు పూర్తిగా వ్యతిరేకమైన వాదిసంవాదులు “భూప్‌” రాగానికి ఉన్నాయి. “భూప్‌” రాగానికి వాది ” గ”, సంవాది “ద”.
పైన చెప్పినట్లు, మోహన రాగంలో అన్యస్వరాలను అందంగా ఉపయోగించటం మన పాత సినిమా సంగీత దర్శకులు కూడా చేసారు. అప్పుచేసి పప్పు కూడు సినిమా కోసం సాలూరు రాజేస్వరరావు స్వర కల్పన చేసిన ” ఎచటనుండి వీచెనో ఈ చల్లని గాలి..” అన్న పాటలో ” వీచెనో..” అన్న పదం తరువాత సాగే గమకంలో మోహన రాగంలో నిషిద్ధమైన “నిషాధం” పడుతుంది. అయినా, పాట వినసొంపుగా ఉంది. అలాగే శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా కోసం పెండ్యాల వెంకటేశ్వరరావు స్వరం ఇచ్చిన “మనసు పరిమళించెనే..” అన్న పాట మొదలవుతూనే వినిపించే స్వరాల్లో తీవ్ర నిషాధం ఉపయోగించటం జరిగింది. ఇలాంటి ఇంకో ఉదాహరణ గుండమ్మ కధ సినిమాలోని “మౌనముగా నీ మనసు పాడినా..” అన్న మోహనం రాగంలోని పాటలో కూడా ” నీ మనసు నాదనుకొంటిలే..” అన్నప్పుడు “మనసు” లో నిషాధం పలికించాడు ఘంటసాల.
              “మదిలోని మధుర భావం పలికేను మోహన రాగం..” అనే యుగళగీతం జయసింహ సినిమా కోసం టి. వి. రాజు స్వరకల్పన చెస్తే ఘంటసాల, బాల సరస్వతులు పాడారు. (ఏదైనా సినిమా పాటలోని సాహిత్యంలో ఒక రాగం పేరు కపడితే, ఆ పాట ఆ సాహిత్యంలో కనిపించే రాగంలో స్వరకల్పన చేయబడిందని చెప్పకండి! చిక్కుల్లో పడగలరు. ఉదాహరణకు, ” మోహనరూపా గోపాలా..” అన్న పాట చెంచులక్ష్మి సినిమాకోసం స్వరం చేయబడింది మోహనం రాగంలో కాదు, ” హిందోళం” రాగంలో!) ఈ పాటలో గమనించవలసిన అంశాలు రెండు. మొదటిది, అద్భుతంగా వీణపై పలికించిన శుద్ధ కర్ణాటక పరమైన మోహనం రాగస్వరాలు మనం విని ఆనందించేలోపే చక్కగా హవాయిన్‌ గిటార్‌ వినిపిస్తూ వీణ వినమరుగవుతుంది.చరణాల మధ్య ఉన్న సంగీతంలో కూడా మహాద్భుతంగా గిటార్‌ని ఉపయోగించుకోవడం గమనించతగ్గది. రెండవది, గాయని, గాయకుల్లోని శ్రుతులు. సహజంగా లలితంగా పాడే శ్రీమతి రావు బాలసరస్వతీ దేవి గొంతు,పై శ్రుతులకన్న క్రింది శ్రుతుల్లో ఎక్కువ మాధుర్యంగా ఉంటుంది. గాయకుడుగా ఘంటసాల ఇందుకు పూర్తిగా విరుద్ధం! దీనికి కొంత కారణం సహజంగా మగవారి శ్రుతి, ఆడవారి శ్రుతి కన్నా హెచ్చుగా ఉండటం.( ఈ నాటి ప్రముఖ గాయని “చిత్ర” శ్రుతి సహజంగా హెచ్చుగా ఉండటంవల్ల, ఈ నాటి సంగీతానికి తగ్గట్టు చాలా సునాయాసంగా ఎక్కువ యుగళ గీతాలు పాడగలుగు తున్నారు.) అందువల్ల ఈ యుగళ గీతానికి సరి అయిన శ్రుతికోసం,ఘంటసాల చేత తక్కువ శ్రుతిలో పాడించటం జరిగింది.ఈ రకంగా పాడించడం వల్ల పాటకు ఒక కొత్త అందం వచ్చింది. ఇదే సినిమాలో టి.వి. రాజు, ఘంటసాల, లీలలతో పాడించిన “ఈనాటి ఈహాయి..” అన్న పాట మోహనం రాగంలో పాడించటం మరో గొప్ప విషయం. ఈ రెండు పాటల సంగీతంలోని వైవిధ్యాలను గమనించండి. అవటానికి మళ్ళీ ఈ రెండు పాటలూ ప్రణయ గీతాలే!
(Source : www.eemaata.com)