Showing posts with label Raagaas. Show all posts
Showing posts with label Raagaas. Show all posts

Saturday, December 8, 2012

Abheri Raagam

అభేరి  రాగం
(Source : www.eemaata.com)
              మన సంగీతంలో రాగాల ప్రాధాన్యత గురించి రెండు మాటలు చెప్పుకోవాలి. భారతీయ సంగీతం, రాగాలు ఒకటి విడిచి మరొకటి లేదు! హిందూస్తానీ సంగీతం కాని, కర్ణాటక సంగీతం కాని, గాత్రం కాని, వాయిద్యాలపై కాని,ఆలాపన, ఖయ్యాల్‌, కీర్తన ఏదైనా కాని సంగీతంలో ఆనందానికి మూలకారణం రాగం. ఆలాపనలో ఏ సాహిత్యం లేకపోయినా, ఖయ్యాల్‌, పల్లవిలలో సాహిత్యం కొంత మాత్రమే ఉన్నా, భజనల్లోనూ, కీర్తనల్లోనూ ఎంతో సాహిత్యం ఉన్నా రాగాల ద్వారానే రసికులైన శ్రోతలను ఆకట్టుకోవటం జరుగుతుంది.ఏ రాగానికైనా ఆరొహణలోకాని, అవరోహణలో కాని కనీసం ఐదు స్వరాలకి తక్కువ కాకుండా రాగాన్ని నిర్వచిస్తారు. అయితే, సంగీతంలో భావం లేకుండా, స్వరాలు మాత్రం నిర్దుష్టంగా పలికించినంత మాత్రాన రాగ స్వరూపాన్ని తెలియ చెప్పలేరు. అందుకే, రాగం యొక్క భావాన్ని నరనరాల్లోనూ జీర్ణించుకొంటే తప్ప, రాగ స్వరూపం అర్ధం కాదు. కొత్తగా సంగీతం మీద అభిరుచి పెంచుకొనేవారికి అందుకే రాగం అర్ధం కావటానికి సమయం పడుతుంది. సంగీతంపై అభిమానం,అభిరుచి ఉన్నవారు, వీలు కలగ జేసుకొని ప్రఖ్యాత సంగీత విద్వాంసుల కచ్చేరీకి వెళ్ళి వినటం చూస్తే, సంగీతం గురించి తెలియని వారికి అదొక వేలం వెర్రిలా అనిపిస్తుంది కానీ సంగీత ప్రియులకి ఇలా వినటం ఒక అవసరం.
                ఈ వ్యాసాల ద్వారా రాగాలను పరిచయం చెయ్యటంలో చాలా వివరాలు వదిలేయటం జరిగింది. ఉదాహరణకు, సంగీతంలో ఒక ముఖ్యభాగమైన “తాళం” గురించి చెప్పలేదు! అలాగే కొన్ని సాంకేతిక వివరాలు కావాలనే వదిలేసాను. అందుకు ముఖ్య కారణం, శ్రోతపాఠకులకు musicology వివరాలవల్ల అసలు విషయం మరుగున పడిపోతుందన్న భయం వల్ల కొంత, సులభ శైలిలో సంగీతాన్ని పరిచయం చెయ్యాలనే తాపత్రయం వల్ల కొంత, మొత్తం మీద కావాలనే చాలా వివరాలు వదిలేసాను. ఉత్సాహం, ఆసిక్తి ఉన్నవారు ఆ వివరాలు తామే తెలుసుకొనే ప్రయత్నం చేస్తారని నా ఆశ.)
అభేరి రాగం ఆధారంగా / దగ్గరగా ఉన్న కొన్ని పాటలు, పద్యాలు
1. ఊరకే కన్నీరు నింప కారణ మేమమ్మా… (లవకుశ)
2. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని… (గులేబకావళి కధ) 3. నా కంటి పాపలో నిలిచి పోరా… (వాగ్దానం) 4. వెన్నెల లోని వేడిమేలనో వేడిమిలోని హాయి ఏలనో… (పెళ్ళినాటి ప్రమాణాలు) 5. చల్లగ చూడాలి పూలను అందుకుపోవాలి… (పెళ్ళినాటి ప్రమాణాలు) 6. రాగమయి రావే అనురాగమయి రావే… (జయభేరి) 7. చిగురాకులలో చిలకమ్మా… (దొంగ రాముడు) 8. కలవరమాయే మదిలో నా మదిలో… (పాతాళ భైరవి) 9. నీవేనా నను పిలచినది నీవేనా నను తలచినది… (మాయా బజార్‌) 10. ఓ నెల రాజా వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని నాకేనోయ్‌.. (భట్టి విక్రమార్క) 11. నీ లీల పాడెద దేవా… (మురిపించే మువ్వలు) 12. నీలి మేఘాలలో గాలికెరటాలలో… (బావా మరదళ్ళు) 13. ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు… (మల్లీశ్వరి మొదటి చరణం మాత్రమే) 14. రావోయి చందమామ మావింత గాధ వినుమా… (మిస్సమ్మ) 15. తెలిసిందిలే తెలిసిందిలే నెల రాజ నీరూపు తెలిసిందిలే… (రాముడుభీముడు) 16. ప్రేమ యాత్రలకు బృందావనము నందన వనమూ ఏలనో… (గుండమ్మ కధ) 17. నిన్న కనిపించింది నన్ను మురిపించింది… (రాణి రత్నప్రభ) 18. సడి సేయకోగాలి సడి చేయబోకే… (రాజ మకుటం) 19. నీవే నీవే నిన్నే నిన్నే… (ఇంటికి దీపం ఇల్లాలు) 20. ఉయ్యాల జంపాల లూగరావయా… (చక్రపాణి) 21. పదిమందిలో పాట పాడినా… (ఆనంద నిలయం) 22. కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో… (అప్పుచేసి పప్పుకూడు) 23. కళ్లు మూసుకొని వళ్ళు చూసుకొని కాలం గడపకు… (ప్రైవేటు రికార్డ్‌) 24. రావోయి బంగారి మామా నీతోటి రాహస్య మొకటున్నదోయి… (ప్రైవేటు రికార్డ్‌) 25. హాయమ్మ హాయి మా పాపాయి… (ప్రైవేటు రికార్డ్‌ ) 26. బంగారు పాపాయి బహుమతులు పొందాలి… (ప్రైవేటు రికార్డ్‌) 27. కనుల దీపికలుంచి మనసు వాకిలి తెరచి… (ప్రైవేటు రికార్డ్‌) 28. క్రొంజికురాకు వ్రేళుల కురుల్‌ తడియార్చుచు… (ప్రైవేటు రికార్డ్‌ పద్యం) 29. ఓహో మేఘమాలా నీలాల మేఘమాల… (భలే రాముడు) 30. తెలవారదేమో స్వామీ (శ్రుతిలయలు)
                        మన సంగీతంలో మరొక ప్రసిద్ధ రాగం అభేరి. క్రిందటి వ్యాసంలో పరిచయం చేసిన మోహనం రాగం లాగే అభేరి కూడా నిర్దుష్టమైన రూపం, రసం ఉన్న రాగం. కరుణ, భక్తి రసాలు ప్రధానంగా ఉన్న ఈ రాగంలో సృజన ( creativity ) కి అవకాశం ఎక్కువ.
స్వరస్థానాలు పరిచయం
         క్రిందటి వ్యాసంలో పరిచయం చేసిన మోహనం రాగానికి ఇచ్చినట్టే ఈ వ్యాసంలో కూడా అవసరమైన స్వరస్థానాలు మళ్ళీ అలాగే ఇస్తున్నాను. ఏదైనా ఒక రాగం గురించి తెలుసుకొని, గుర్తు పెట్టుకోవాలంటే, స్వర జ్ఞానం అవసరం. సప్త స్వరాలైన ” స, రి, గ, మ, ప, ద, ని ” స్వరాలలో మూల స్వరాలైన “స, ప” లను మినహాయిస్తే, మిగిలిన ఐదు స్వరాలకి ఒక్కొక్క స్వరానికి రెండు స్వర స్థానాలున్నాయి. అందువల్ల, సప్త స్వరాలకి 12 స్వర స్థానాలున్నాయి. అవి వరుసగా,
స్వరము కర్ణాటక పద్ధతి హిందూస్తానీ పద్ధతి
సంకేతము స షడ్జమం షడ్జ స రి శుద్ధ రిషభం కొమల్‌ రిషభ రి 1 రి చతుశ్రుతి రిషభం తీవ్ర రిషభ రి 2 గ సాధారణ గాంధారం కొమల్‌ గాంధార గ1 గ అంతర గాంధారం తీవ్ర గాంధార గ2 మ శుద్ధ మధ్యమం కోమల్‌ మధ్యమ మ1 మ ప్రతి మధ్యమం తీవ్ర మధ్యమ మ2 ప పంచమం పంచమ ప ద శుద్ధ ధైవతం కోమల్‌ ధైవత ద 1 ద చతుశ్రుతి ధైవతం తీవ్ర ధైవత ద 2 ని కైశిక నిషాధం కోమల్‌ నిషాద ని 1 ని కాకలి నిషాధం తీవ్ర నిషాద ని 2
మొత్తం పన్నెండు స్వరాలని వరుసగా ” స, రి 1, రి 2, గ 1, గ 2, మ 1, మ 2, ప, ద 1, ద 2, ని 1, ని 2 ” గా వ్రాసినట్టయితే, అభేరి ఉపయోగించే స్వరాలు ” స, రి2, గ 1, మ1, ప, ద 2, ని1 “. ఇది ఔడవ సంపూర్ణ (ఐదు ఏడు స్వరాల) రాగం. అంటే, ఆరొహణలో ఐదు స్వరాలు, అవరోహణలో ఏడు స్వరాలు ఉపయోగించే రాగం. ” స గ మ ప ని స స ని ద ప మ గ రి స ” లాగా ఉపయోగించే రాగం.
ఇంతకుముందు చెప్పినట్టు, మొత్తం 12 స్వరస్థాయిలని దృష్టిలో పెట్టుకొని చూస్తే, హార్మోనియం పై అభేరి రాగాన్ని ఈ క్రింది విధంగా పలికించ వచ్చు.
ఆరోహణ స X X గ1 X మ1 X ప XX ని1 X స
అవరోహణ స X ని1 ద2 X ప X మ1 X గ1 రి2 X స
ఆరోహణలో “స” నుంచి “గ” కు వెళ్ళేటప్పుడు, తిన్నగా “గ” కు వెళ్ళకుండా “స” నుంచి ముందు “మ” చేరి క్షణ కాలంలో “గ” ను చేరాలి. అలాగే, “ప” నుంచి “ని” చేరేటప్పుడు ముందు “స” చేరి క్షణ కాలంలో “ని” చేరాలి. అంటే, ఆరోహణని ఈ విధంగా పలకాలి. “స, మగ, మప, సని, సా”.
అదేవిధంగా, అవరోహణలో “స, సనినీ, నిద దపా, పమ, మగగా గరి,రిసా” లాగా పలకాలి.
శ్రీ కొడుకుల శివరాం ఇచ్చిన ఈ ఆరోహణ, అవరోహణ వినండి! మన కర్ణాటక సంగీతం పద్ధతిలో ఇక్కడ మొదలైన “స” స్వరం శ్రుతి “ఒకటి”. అదే, వెస్టర్న్‌ కీబోర్డ్‌ పద్ధతిలో, ” C” scale కి సమానం. అవకాశం ఉన్నవారు ఈ స్వరాలు వింటూ, కీబోర్డ్‌ మీద స్వరాలు ఇలాగే పలికించండి.
కర్ణాటక సంగీతంలోని 20వ మేళకర్త “నట భైరవి” నుంచి జనించిన రాగం అభేరి. మహ మహోపాధ్యాయ డా. నూకల చినసత్యనారాయణ ” రాగ లక్షణ సంగ్రహం” పుస్తకంలో రాసిన ప్రకారం, 50 ఏళ్ళ క్రితం ఈ రాగం శుద్ధ ధైవతం (హిందూస్తానీలో కోమల్‌ దైవతం) లో పాడేవారట! రాను రాను చతుశ్రుతి ధైవతం (హిందూస్తానీలో తీవ్ర దైవతం) ఉపయోగించటం వల్ల రాగం వినటానికి ఆహ్లాదంగా ఉండటం గుర్తించిన తరువాత, అభేరిలో చతుశ్రుతి ధైవతం స్థిరపడి పోయింది.ఇప్పుడు ప్రచారంలో ఉన్న ” నగుమోము కనలేని..” అన్న ప్రసిద్ధ త్యాగరాజ కృతి (కర్ణాటక సంగీతంలో
త్రిమూర్తులలో ఒకరైన శ్రీ త్యాగరాజు, అభేరి రాగంలో ఈ ఒక్క కృతి తప్ప మరే కృతులు మనకివ్వలేదు!), మొదట ప్రవేశ పెట్టిన పద్ధతి కన్నా, హిందీస్తానీ సంగీతంలో అభేరికి దగ్గరైన భీంపలాస్‌ రాగానికి దగ్గరగా ఉంటూంది. ఈ నాడు ప్రచారంలో ఉన్న అభేరి రాగంలోని స్వరాల ప్రకారం, అభేరి 22వ మేళ కర్త అయిన “ఖరహర ప్రియ” కు జన్య రాగంలా అనిపిస్తుంది.
అందువల్ల, హిందూస్తానీ సంగీతంలోని ధన్యాసి, భీంపలాస్‌ రాగాలు అభేరి పాత,కొత్త పద్ధతుల్ని వరుసగా పోలి ఉంటాయి.
పైన చెప్పిన అభేరి రాగంలోని మార్పు, కాలక్రమంలో రాగాలలో వచ్చిన మార్పులకి ఒక ఉదాహరణ మాత్రమే! నిజానికి కొన్ని వందల ఏళ్ళ క్రిందట ప్రచారంలొ ఉన్న రాగాలు ఇప్పుడు లేవు. కాలానుగుణంగా కొన్ని రాగాలు మరుగున పడినా, సృజనాత్మకత కలిగిన విద్వాంసుల వల్ల, మరి కొన్ని కొత్త రాగాలు మన సంగీతంలో చోటు చేసుకొని సుసంపన్నం చేసాయి. పట్‌దీప్‌,చంద్రకౌన్స్‌, మారుబేహాగ్‌, కళావతి, మధువంతి, శివరంజని వంటి రాగాలు హిందుస్తానీ సంగీతంలో మొన్నమొన్ననే వచ్చిన కొన్ని కొత్త రాగాలు. ఒక వేళ అప్పుడూ, ఇప్పుడూ కూడా చాలా పాప్యులర్‌ అయిన అభేరి వంటి రాగాలు ఉన్నా, ఇందాక చెప్పినట్టు ఈ రాగాలు కాలంతో మారాయి. ఈనాడు మనకున్న రికార్డింగ్‌ సౌకర్యం వల్ల, ఇప్పుడు ప్రచారంలో ఉన్న రాగాలు, వాటి లక్షణాలు మనం రికార్డ్‌ చేసి ముందు తరాలవారి కోసం దాచి ఉంచే వీలు మనకుంది. కానీ, మొన్న మొన్నటి
దాకా ఇటువంటి వీలు లేక పోవడం వల్ల, సంగీతం నేర్పే విద్వాంసులు,వీలైనంత వరకు యధాతధంగా ఒక తరం నుంచి మరొక తరానికి, పూర్తిగా సాధన, జ్ఞాపక శక్తి మీద ఆధారపడి, సంగీతాన్ని పరంపరలుగా నిలుపుతూ వచ్చారు. ఇదే మన సంగీతంలోని సాంప్రదాయం! సహజంగా ఇటువంటి ప్రయత్నాలలో సంగీతం చాలా మార్పులు చెందే అవకాశం ఉండడంవల్ల, సంగీత విద్వాంసులు నిర్దిష్టమైన సంగీత సాంప్రదాయాలను అనుసరించి, సద్గురుశిష్య పరంపరలుగా విద్యను యధాతధంగా మనకు అందించటం జరిగింది.
హిందూస్తానీ సంగీతంలో…
కర్ణాటక రాగం “అభేరి” కి హిందూస్తానీ సంగీతంలో దగ్గరైన రాగం “భీంపలాస్‌”. క్రిందటి వ్యాసం “మోహనం” లో ఇచ్చిన, హిందూస్తానీ, కర్ణాటక పద్ధతుల్లోని పోలికలు తేడాలతో పోలిస్తే, అభేరి, భీంపలాస్‌ రాగాలు ఒకటికి మరొకటి చాలా దగ్గరగా ఉంటాయి. భీంపలాస్‌ రాగం, “భీం”,”పలాస్‌” అన్న రెండు రాగాల కలయిక అంటారు కొంతమంది. మరికొందరు, ఈ రాగం
అసలు పేరు “పలాస్‌”, దానికి భీమ్‌ అన్న విశేషణం తరవాత కలిపారు అంటారు ( ఈ రాగం గొప్పది కాబట్టి, శంకరాభరణం రాగాన్ని ధీరశంకరాభరణం అన్నట్టు, “పలాస్‌” కి ముందు “భీమ్‌” అన్నది కలిపారని కొందరి వాదన). హిందూస్తానీ సంగీతంలో చాలా ప్రాచుర్యం పొందిన ఈ భీంపలాస్‌ రాగం,మరాఠీ స్టేజి మీద చాలా ముఖ్యమైన రాగం. అభేరి రాగానికి ఉన్నట్టుగానే భీంపలాస్‌ రాగానికి కూడా ఆరోహణఅవరోహణ “స గ మ ప ని స స ని ద ప మ గ రి స”. ఈ రాగానికి వాది స్వరం “మ”, సంవాది “స”. కర్ణాటక పద్ధతిలో వాదిసంవాదిల ప్రసక్తి ఉన్నా, వీటిని ఎక్కువగా ఉపయోగించుకున్నట్టు కనపడదు. భీంపలాస్‌ రాగం “ని స మ” అన్న స్వరాలతో మొదలు పెట్టటం చాలా విన సొంపుగా ఉంటుంది. “మ గ” అన్న సంగతి వాడకం ఈ రాగంలో ఎక్కువ. భీంపలాస్‌ పకడ్‌ (స్వరాల గుంపు) ఈ విధంగా ఉంటుంది.
ని స మ S S మ ప గ మ గ రి స
పైన చెప్పిన పకడ్లో S అన్న గుర్తు దీర్ఘ స్వరాన్ని తెలియచేస్తుంది.అంటే, “ని స మ” అన్నప్పుడు “మ” మీద దీర్ఘం తీయటం వల్ల, “ని స మా”గా మారుతుంది. భీంపలాస్‌ పూర్వాంగ రాగం. మొత్తం పన్నెండు స్వరస్థానాలని రెండు గ్రూప్‌లుగా విడకొట్టి, స నుంచి ప వరకు ఒక గ్రూప్‌, ప నుంచి పై స వరకు రెండవ గ్రూప్‌ అనుకుంటే, ఏ రాగంలో స్వరాల సంచారం మొదటిగ్రూప్‌ మీద ఎక్కువగా ఉంటుందో అది పూర్వాంగ రాగం. రెండో గ్రూప్‌ మీద ఆధారపడేది ఉత్తరాంగ రాగం అవుతుంది.
సినిమా పాటల పరిచయం ముందు, ప్రముఖ హిందూస్తానీ సంగీత విద్వాంసుడు స్వర్గీయ మల్లికార్జున్‌ మన్సూర్‌ పాడిన ఈ భీంపలాస్‌ రాగం వినండి. మొత్తం 30 నిమిషాలుకు పైగా సాగే ఈ గానం, ఈమాట పాఠశ్రోతలకు ఒక ఉదాహరణగా ఈ రాగం ఛాయల్ని వినిపించటం కోసం, ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఇస్తున్నాం! శాస్త్రీయ సంగీతం వినటం ఎక్కువగా అలవాటు లేనివారికి ఒక సూచన. సినిమా పాటలు, ఇతర లలిత గీతాలూ ఇచ్చినంత తొందరగా ఆనందం శాస్త్రీయ సంగీతం ఇవ్వదు కాబట్టి, ప్రశాంతంగా ( inhibitions ఏమీ లేకుండా)ఈ రాగం వినండి. వినగా, వినగా మీ మనస్సుల్లో అభేరి లేకపోతే భీంపలాస్‌ రాగాల్లో బాణీలు కట్టిన ఎన్నో పాటలు గుర్తుకు వస్తాయి. కొంచెం రాగాలతో పరిచయమున్నవారుి, ఇక్కడ ఇచ్చిన రాగాలాపనలో, రాగం ఎలా evolve అవుతుందో గమనించగలుగుతారు. నెమ్మదిగా మంద్ర స్థాయిలో మొదలు పెట్టిన ఈ గానం, రాను రాను రాగాలాపనలోనూ, గమనంలోనూ వేగం పుంజుకొని మిమ్మల్ని ఎక్కడకో లాక్కుపోతుంది. ఇలాంటి ఉదాహరణల వల్ల సినిమాపాటలకి,శాస్త్రీయ సంగీతానికి ఉన్న తేడాలు, పోలికలు కూడా తెలుస్తాయి. స్వర్గీయ మన్సూర్‌ గొంతులో ఒకరకమైన “జీర” మొదట మీకు వినిపించినా, త్వరగా అది మీరు మర్చిపోయి రాగంలో పడిపోతారు!
సినిమా పాటలు
తెలుగు సినిమా పాటల్లో, కర్ణాటక శాస్త్రీయ సంగీతానికి అతి దగ్గరగా బాణీ కట్టి, పాప్యులర్‌ అయిన పాట, శ్రీమతి ఎస్‌. జానకి మురిపించే మువ్వలు సినిమాకోసం పాడిన “నీ లీల పాడెద దేవా..” అన్న పాట. ఈ పాట ఇప్పటికీ తెలుగు వారి నాలుకల మీద ఆడుతూనే ఉంది. తమిళంలో కూడా ఈ పాట గొప్ప ప్రజాదరణ పొందింది. శ్రీమతి జానకి గొంతు ఈ పాటకి ఎంత బాగా సరిపోయిందో,గాత్రానికి మించి సన్నాయి పై సహకారం అందించిన శ్రీ కరైక్కుడి అరుణాచలం వాద్య సహకారం అంత కంటే ఇంకా చక్కగా ఉంది. పాట మొదట్లో జానకి గొంతు, నాదస్వరం స్వరం విడివిడిగా గుర్తు పట్టగలిగినా, పాటలో వేగం పెరిగిన
తరువాత, గాత్రంనాదస్వరం ఒక్కసారే వినిపిస్తున్నపుడు, ఈ రెంటికీ తేడా తెలియకుండా పోతుంది.
తెలుగువారి మధుర గాయకుడు, సంగీత దర్శకుడు ఘంటసాల చాలా సినిమాల్లో అభేరి రాగాన్నివాడటమే కాకుండా, ప్రైవేటు రికార్డుల్లో స్వరం ఇచ్చిన పాటల్లో “రావోయి బంగారి మామా నీతోడి రాహస్య మొకటున్నదోయి..” అన్న పాట అభేరి రాగంలో కట్టినదే! పాట వింటూ ఉంటే, ఒక పల్లెటూరి వాతావరణం సంగీతంలో సృష్టి చేసాడు ఘంటసాల.మూడవచరణం లో మొదలైన “ఏటి పడవ సరంగు పాట గిరికీలలో….” తరవాత వచ్చే గమకాలు, ఆలాపనలో లలితంగా ఒక folk tune వినిపించటమే కాకుండా, సుశాస్త్రీయంగా కూడా అభేరి రాగానికి న్యాయం చేకూర్చాడు. సాహిత్యంలో ఇది అచ్చంగా ఒక తెలుగుపాట. సంగీతంలోనూ ఇది అంతకంటే మరీ అచ్చమైన తెలుగు పాట.
గుండమ్మ కధ సినిమాలో ఎన్నో పాటలు పాప్యులర్‌ అయ్యాయి. “ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో..” అన్నపాట తెలియని తెలుగువారు బహుశా ఉండరేమో! ఒక పాట బాణీ కాపీ కొట్టి మరొక పాటలో వాడుకున్న సందర్భాలు
మన సినిమా పాటల్లొ ఎన్నో ఉన్నాయి. కానీ, ఇళయ రాజా డిటెక్టివ్‌ నారద అన్న సినిమాలో ఈ పాటను పూర్తిగా ఉపయోగించుకుంటూనే “యవ్వనాల పువ్వులన్ని నవ్వుతున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామా ..” అని చిత్ర గొంతుతో మొదలయ్యే ఈ పాట ఒక అద్భుత సృష్టి. ఇళయరాజా creativity మళ్ళీ ఈ పాటలొ మరోసారి చూపించాడు. ఈ పాటలో వాడుకున్న వాయిద్యాలు, వాటి ఆర్కెస్ట్రేషన్‌ మళ్ళి ఇంకోసారి వినండి.
అభేరి రాగంలో ఆరోహణ స్వరాల్ని అలాగే వాడుతూ, అవరోహణలో మాత్రం “ద,రి” లను వాడకుండా,అంటే అరోహణలోనూ అవరోహణలోను కూడా “స గ మ ప ని” స్వరాలనే వాడుతూ శ్రీమతి లీలచే పాడిచిన దేవులపల్లి సాహిత్యం “సడిసేయకో గాలి సడి చేయబోకే ..” అన్న పాటను రాజమకుటం సినిమాకోసం మాస్టర్‌ వేణు స్వరపరిచాడు. పాట మొదలవుతూనే వినే ఆలాపన ఎంత అద్భుతంగా ఉందో, చరణాల మధ్య వచ్చే క్లారినెట్‌ వాయిద్యం అందుకు సమానంగా ఉంది.
ఈ పాట శ్రద్ధగా వింటే, అభేరి రాగ లక్షణాలు ఈ పాటలో తక్కువగా వినపడ్తాయి. అందుకు ముఖ్యకారణం, ఇందాకా చెప్పినట్టు “రి, ద” లను వాడకపోవటమే! ఈ పాటలోని సాహిత్యం సంగతి సరే సరి! శ్రీమతి లీల పాడిన “ఆనాటి” పాటల లిస్టు ఎవరన్నా తయారు చేస్తే, ఆ లిస్టులో ఈ పాట తప్పకుండా ముందు ఉండాల్సిన పాట.
చివరిగా, “ఈనాటి” పాటల్లో అభేరిలో స్వరం చేసిన ఒక పాటతో ఈ వ్యాసం ముగిస్తాను. శ్రుతిలయలు సినిమా కోసం కె. వి. మహాదేవన్‌ సంగీతం ఇచ్చిన “తెలవారదేమో స్వామీ..” అన్న పాట అభేరిలో స్వరపరచిందే! పాట వింటూ ఉంటే “నగుమోము కనలేని..” అన్న త్యాగరాజ కీర్తన ఛాయలు కనపడతాయి.ఈ పాట గురించి ఎక్కువ చెప్పక్కరలేదు. ఎందుకంటే, సినిమా సంగీతంలో ఎన్నో గొంతులు వినిపిస్తూ ఉన్నా, జేసుదాసు గొంతుకి ఒక ప్రత్యేకత ఉంది.శాస్త్రీయ సంగీత జ్ఞానంతో పాటు, లలిత సంగీతం, వీటన్నిటికీ మించి ఏ సంగీతాన్నయినా “సంగీతం”గా వినిపలికించగలిగే గొంతు జేసుదాస్‌ది! ===============================================================
Source : www.eemaata.com

Mohana Raagam

మోహన రాగం
మోహన రాగం ఆధారంగా ఉన్న కొన్ని పాటలు, పద్యాలు 1. లాహిరి లాహిరి లాహిరిలో… (మాయాబజార్‌) 2. చెంగు చెంగునా గంతులు వేయండి… (నమ్మిన బంటు) 3. ఎచటనుండి వీచెనో… (అప్పుచేసి పప్పుకూడు) 4. మనసు పరిమళించెను… (శ్రీ కృష్ణార్జున యుద్ధం) 5. అయినదేమో అయినది ప్రియ… (జగదేకవీరుని కధ) 6. మోహన రాగమహా మూర్తిమంత మాయే… (మహా మంత్రి తిమ్మరసు) 7. వే వేలా గొపెమ్మలా మువ్వా గోపాలుడే… (సాగర సంగమం) 8. పాడవేల రాధికా… (ఇద్దరు మిత్రులు) 9. వినిపించని రాగాలే కనిపించని… (ఆరాధన) 10. నను పాలింపగ నడచి వచ్చితివా… (బుద్ధిమంతుడు) 11. ఘనా ఘన సుందరా… (చక్రధారి) 12. సిరిమల్లే నీవె విరిజల్లు కావే… (పంతులమ్మ) 13. మదిలో వీణలు మ్రోగె… (ఆత్మీయులు) 14. నిన్ను కోరి వర్ణం… (ఘర్షణ) 15. మధుర మధురమీ చల్లని రేయీ… (విప్రనారాయణ) 16. మదిలోని మధుర భావం… (జయసింహ) 17. ఈనాటి ఈహాయి కలకాదోయి… (జయసింహ) 18. నల్లవాడే వ్రేపల్లె వాడే… (చిరంజీవులు) 19. తెల్ల వార వచ్చె తెలియక నా స్వామి… (చిరంజీవులు) 20. మౌనముగా నీ మనసు పాడినా… (గుండమ్మ కధ) 21. తెలుసుకొనవె యువతీ అలా నడచుకొనవె… (మిస్సమ్మ) 22. చందన చర్చిత నీల కళేబర… (తెనాలి రామకృష్ణ) 23. ఆ మొగల్‌ రణధీరులు… (ప్రైవేటు రికార్డ్‌ పద్యం) 24. భారతీయుల కళా ప్రాభవమ్ము లిఖించి… (ప్రైవేటు రికార్డ్‌ పద్యం) 25. కనులకు వెలుగువు నీవే కాదా… (భక్త ప్రహ్లాద) 26. శివ శివ శంకరా… (భక్త కన్నప్ప) 27. జ్యోతి కలశ… (భాభీ కీ చుడియా) 28. ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో… (అమరశిల్పి జక్కన్న) 29. పులకించని మది పులకించు… ( పెళ్ళికానుక) 30. తిరుమల గిరి వాసా… (రహస్యం)           తెలుగు పాటల్లో మోహన రాగం వినిపించినంత విస్తృతంగా మరో రాగం వినపడదేమో! దీనికి ముఖ్య కారణం ఈ రాగంలో వినిపించే (వినిపించగలిగే) రకరకాలైన అనుభూతులు. స్వర పరంగా మోహన రాగం ఐదు స్వరాల (స, రి, గ, ప, ద) రాగమైనప్పటికీ, మోహనం ఇవ్వగలిగే abstractness వల్ల, సంగీతపరంగా చూపే లోతులలో ఉన్న వైవిధ్యాల వల్ల, శాస్త్రీయ సంగీతంలో ఈ రాగానికి ఒక విశిష్ట స్థానముంది. మన కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోని మోహనం రాగానికి “దగ్గరగా” ఉండే రాగం హిందూస్తానీ శాస్త్రీయ సంగీతంలో “భూప్‌”. స్వర పరంగా ఈ రెండు రాగాలు ఒకటే అయినప్పటికీ, శాస్త్రీయ సంగీతంలో పరిచయంఉన్న వారు ఈ రెంటినీ రెండు విభిన్న రాగాలుగా పేర్కొంటారు. మోహనం చాలా అవకాశం గల రాగం. (పైన మోహనం రాగంలో ఉన్న కొన్ని పాటల, పద్యాల లిస్టు చూస్తే, మోహనం ఎంత అవకాశం గల రాగమో అర్ధమవుతుంది. ) ఈ ప్రసిద్ధ రాగానికి నిర్దుష్టమైన రూపం, రసం, భావం ఉన్నాయి. (ప్రతి రాగానికి తనదంటూ ఒక ప్రత్యేకత ఉన్నా, మోహనం వంటి నిర్దుష్టమైన రాగాలు మన సంగీతంలో కొన్ని మాత్రమే ఉన్నాయి.) అన్నివేళలా పాడటానికి అనువైన ఈ రాగం శృంగార, భక్తి, శాంత, వీర రస ప్రధానమైనది. తక్కువ స్వరాలే ఉన్నా ఎక్కువ రక్తి కలిగి శ్రోతలకు సులభంగా అర్ధమవుతుంది. మిగిలిన రాగాలతో పోలిస్తే, మోహనం విని ఆనందించటం సులభం. పాడటం సులభం. స్వరస్థానాలు పరిచయం ఏదైనా ఒక రాగం గురించి తెలుసుకొని, గుర్తు పెట్టుకోవాలంటే, స్వర జ్ఞానం అవసరం. సప్త స్వరాలైన ” స, రి, గ, మ, ప, ద, ని ” స్వరాలలో మూల స్వరాలైన “స, ప” లను మినహాయిస్తే, మిగిలిన ఐదు స్వరాలకి ఒక్కొక్క స్వరానికి రెండు స్వర స్థానాలున్నాయి.అందువల్ల, సప్త స్వరాలకి 12 స్వర స్థానాలున్నాయి. అవి వరుసగా, స్వరము కర్ణాటక పద్ధతి హిందూస్తానీపద్ధతి సంకేతము స షడ్జమం షడ్జ స రి శుద్ధ రిషభం కోమల్‌ రిషభ రి 1 రి చతుశ్రుతి రిషభం తీవ్ర రిషభ రి 2 గ సాధారణ గాంధారం కోమల్‌ గాంధార గ1 గ అంతర గాంధారం తీవ్ర గాంధార గ2 మ శుద్ధ మధ్యమం కోమల్‌ మధ్యమ మ1 మ ప్రతి మధ్యమం తీవ్ర మధ్యమ మ2 ప పంచమం పంచమ ప ద శుద్ధ ధైవతం కోమల్‌ ధైవత ద 1 ద చతుశ్రుతి ధైవతం తీవ్ర ధైవత ద 2 ని కైశిక నిషాధం కోమల్‌ నిషాద ని 1 ని కాకలి నిషాధం తీవ్ర నిషాద ని 2 మొత్తం పన్నెండు స్వరాలని వరుసగా ” స, రి 1, రి 2, గ 1, గ 2, మ 1, మ 2, ప, ద 1, ద 2, ని 1, ని 2 ” గా వ్రాసినట్టయితే, మోహనం ఉపయోగించే స్వరాలు ” స, రి 2, గ 2, ప, ద 2, “. ఇది ఔడవ (ఐదు స్వరాల) రాగం. అంటే, ఆరోహణలోనూ, అవరోహణలోనూ కూడా ఐదు స్వరాలు ” స రి గ ప ద స స ద ప గ రి స ” లాగా ఉపయోగించే రాగం. కానీ, రాగంలో స్వరాలు ఇదే పద్ధతిన ఒకదాని వెంట మరొకటి రానవసరంలేదు. ఉదాహరణకు, “రి” తరువాత “గ”, “గ” తరువాత “ప” అదే వరుస క్రమంలో రానక్కరలేదు. అంతే కాకుండా, స్వరాలు పలికించినంత మాత్రాన సంగీతం రాదు! ఒక ప్రసిద్ధ సంగీతకారుడు చెప్పినట్టు, రెండు పక్క పక్క స్వరాల మధ్య ఉన్న నిశ్శబ్దాన్ని సూచించేదే సంగీతం. మామూలు పరిభాషలో చెప్పాలంటే, discrete స్వరాలు పలికిస్తే సంగీతం రాదు. దీనికి కారణం, పైపై కనిపించే స్వరాలకన్న లోతుగా నిర్ణయమయ్యేదే రాగం! ఇంతకుముందు చెప్పినట్టు, మొత్తం 12 స్వరస్థాయిలని దృష్టిలో పెట్టుకొని చూస్తే, హార్మోనియం పై మోహనం రాగాన్ని ఈ క్రింది విధంగా పలికించ వచ్చు. స X రి2 X గ2 XX ప X ద2 XX స ఉత్తినే స్వరాలు పలికిస్తే సంగీతం రాదు కాబట్టి, కొత్తగా నేర్చుకొనే వారు ఏదైనా పాట గాని, స్వరాలు తెలిసిన గీతం, వర్ణం గాని సాధన చేస్తే మోహనం రాగం అలవాటవుతుంది. ” X ” వాడినచోట స్వరాలు నిషిద్ధం ఈ రాగంలో! అంటే, “రి1, గ1, మ1, మ2, ద1, ని1, ని2″ లు శుద్ధ మోహనంలో ఉపయోగించ కూడని స్వరాలన్నమాట. హిందూస్తానీ సంగీతంలో… హిందూస్తానీ సంగీతంలో మోహనం అన్న రాగం లేదు. కానీ, మోహనంకి దగ్గరగా ఉండే ” భూప్‌” రాగం (కర్ణాటక పద్ధతిలోని “భూపాలం” రాగానికి, ఇక్కడ చర్చించే హిందూస్తానీ పద్ధతిలోని “భూప్‌” రాగానికీ సంబంధం ఏమీ లేదు) స్వరాలు, అరోహణఅవరోహణ సరిగ్గా మోహనం రాగంలో ఉన్నట్టుగానే ఉంటాయి.హిందూస్తానీ పద్ధతిలో రాగలక్షణాన్ని సూచించటానికి ” పకడ్‌ ” ఉపయోగిస్తారు. తేలిక మాటల్లో చెప్పాలంటే పకడ్‌ (లేదా స్వరాల గుంపు), రాగంలోని ఒక స్వరం నుంచి ఉన్న మిగిలిన స్వరాలకు ఎలా వెళ్ళాలో చెప్పే దారి అన్నమాట! హిందూస్తానీ పద్ధతిలో ఈ పకడ్‌ చాలా ముఖ్యమైనది. ” భూప్‌” రాగం ఉపయోగించే స్వరాల గుంపు లేక పకడ్‌ ఈ విధంగా ఉంటుంది. గ రి స ద స రి ప గ ద ప గ రి స పైన చెప్పిన పకడ్‌లో “స రి ప గ ” అన్న స్వరాలగుంపులో “స” నుంచి “రి” మీదుగా ( “గ” ని వాడకుండా) “ప” ను చేరి “గ” మీద ఆగటం గమనించండి. రాగ లక్షణాన్ని తీసుకు వచ్చేవి ఇలాంటి అతి ముఖ్యమైన వివరాలే! అలాగే, ఈ పకడ్‌లో మధ్య ఇచ్చిన “” గుర్తు, స్వరాల గుంపు మధ్య pause ని సూచిస్తుంది. ఈ విధంగా స్వరాల మధ్య ఆపటం కూడా మరొక ముఖ్యమైన విషయం. హిందూస్తానీ సంగీతంలో రాగం లక్షణం సూచించే మరొక ముఖ్యమైన ఉపకరణం ” వాది సంవాది”. అంటే, రాగంలోని రెండు ముఖ్యమైన స్వరాలను తీసుకొని, అందులో అతి ముఖ్యమైన స్వరాన్ని ” వాది” అని, రెండవ స్వరాన్ని ” సంవాది” అని పిలుస్తారు. ఈ రకంగా చేసే వర్గీకరణం వల్ల, రాగలక్షణం సులభంగా అర్ధమయ్యే వీలు ఉంది. సంగీతాన్ని మొదటిసారిగా వాయిద్యాలపై పలికించటానికి ప్రయత్నించే వారికి మోహన రాగం కొంత సులువుగా ఉంటుంది. మోహన రాగం హార్మోనియం లేదా కీబోర్డ్‌ మీద వాయించటం తేలిక. అలాగే వేణువు లాంటి వాయిద్యాల పై కూడా తేలికగా ఉంటుంది. కొన్ని కొన్ని రాగాలకు కొన్ని కొన్ని వాయిద్యాలు అతికినట్టు సరిపోతాయి. మోహన రాగానికి వేణువుకు ఉన్న సంబంధం అలాంటిదే. కర్ణాటక శాస్త్రీయ సంగీతం కొత్తగా నేర్చుకుంటున్న వారు తప్పకుండా నేర్చుకొనే ” వర వీణా మృదుపాణీ..” అన్న మోహన రాగం గీతం కూడా ఉత్సాహం ఉన్నవారు ప్రయత్నించవచ్చు. లలిత సంగీతంలో కూడా (సినీ గీతాలతో కలసి) మొహన రాగంలో స్వర బద్ధం చేసిన పాటలు అనేకం కనపడతాయి. చాలా మంది శ్రోత పాఠకులకు సినిమా పాటలతో ఎక్కువ పరిచయం ఉండే అవకాశం ఎక్కువ కాబట్టి, వీటిలోని అనేక వైవిధ్యాలున్న పాటలను మోహన రాగం పరిచయం చేయ్యటానికి ఎన్నుకున్నాను. సినిమా పాటల్లోకి దూకేముందు, ప్రఖ్యాత గాయకుడు శ్రీ మంగళంపల్లి బాల మురళీకృష్ణ పాడిన ” నను పాలింపగ నడచి వచ్చితివో…” అన్న త్యాగరాజ కృతి ఒక్క సారి గుర్తు చేసుకుందాం! మోహనరాగం లక్షణం ఏమిటో తెలియాలంటే, మీకు విసుగు వచ్చేదాకా ఇదే కృతి వినండి. సంగీతానికి ” బాగా వినడం” చాలా అవసరం.చాలా ఓపికగా, vocal music మాత్రమే కాకుండా instrumental music కూడా వినటం చెయ్యాలి. ఇలా వినగా వినగా రాగ లక్షణం వంట పట్టించుకొనే అవకాశం ఉంది. సినిమా పాటలు
ఇప్పుడు కొన్ని సినిమా పాటలు గురించి తెలుసుకుందాం. కొన్ని పాటలు పదే పదే వినటం వల్ల వాటిలోని మాధుర్యం మర్చిపోయే ప్రమాదముంది. అలాంటి పాటల్లో మాయాబజార్‌ సినిమాలోని ” లాహిరి లాహిరి లాహిరిలో…” పాట ఒకటి.శుద్ధ మోహన రాగంలోని స్వరాలు తప్ప మరే స్వరాలు ఉపయోగించకుండా, పడవ మీద షికారు పోతూ ప్రేమికులు పాడే పాట ఇది. మెల్లగా, వెన్నెల రాత్రి, చల్లగాలిలో ప్రయాణిస్తూ, మంద గమనంతో సాగే ఈ పాటలోని సంగీతాన్ని వినండి. పాటలోని సాహిత్యానికి తగ్గ రాగం. సాహిత్యానుభూతికి దీటైన సంగీతానుభూతి. ఈ పాటలోని స్వరాలను కొంచెం తేలికగా ఒక వాయిద్యంపై ప్రయత్నించి పలికించవచ్చు. ఉత్సాహం ఉన్నవారికి వీలుగా ఈ పాటలోని స్వరాలను, ఈ వ్యాసం చివర ఇచ్చాను. ఇద్దరు మిత్రులు సినిమాలోని ” పాడవేల రాధికా ..” మరొక ఉదాహరణ. శుద్ధ కర్ణాటక శాస్త్రీయ సంగీత పరంగా బాణీ కట్టి, వీణతో పలికించిన ఈ పాట, ఉత్సాహవంతులు వీణ మీద పలికించ ప్రయత్నిస్తే బాగుంటుంది.
               మోహన రాగంలో ప్రఖ్యాత సినీ సంగీత దర్శకుడు ఇళయ రాజా చేసిన అనేక ప్రయోగాల్లో, రెండు ఇక్కడ చెప్పుకోవాలి.మొదటిది “నిన్ను కోరి వర్ణం..” అన్న ఘర్షణ సినిమాలోని పాట. నిజానికి శుద్ధ కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో “నిన్ను కోరి వర్ణం..” అన్న మోహనం రాగం వర్ణం ఉన్నా, ఈ సినిమా పాట కొంచెం శాస్త్రీయ సంగీతాన్ని వెక్కిరించినట్లు కనపడుతుంది. కానీ, పూర్తిగా మోహన రాగం, ఆది తాళంలో స్వరపరచబడ్డ ఈ పాట వింటే, తెలిసిన మోహన రాగంలో ఎంతటి విలక్షణత తీసుకు రావచ్చో ఇళయ రాజా నిరూపించాడు. ఇలాంటి ప్రయోగాలు మన శాస్త్రీయ సంగీతం మీద మాత్రమే కాకుండా, వెస్టర్న్‌ మ్యూజిక్‌ మీద కూడా మంచి అధికారం ఉన్న ఇళయ రాజా లాంటి వారు మాత్రమే చెయ్యగలరు. రెండవ ఉదాహరణ ” వే వేలా గోపెమ్మలా…” అన్న సాగర సంగమం సినిమాలోని పాట. ఈ పాటకు మోహనం రాగాన్ని మూలంగా తీసుకున్నా, అన్య స్వరాలు అక్కడక్కడ ఉపయోగించటం వల్ల పాటకు ఒక కొత్త అందాన్ని తెచ్చాయి. “మోహనాల వేణువూదే..” అన్న చోట శుద్ధ ( హిందూస్తానీలో కోమల) ధైవతం వాడటం, పాటలో ఉన్న రెండు చరణాలకి మధ్య ఉన్నఇంటర్‌లూడ్స్‌లో వేణువుతో మొదలైన సంగీతంలో మోహనంలో వర్య్జమైన “కోమల్‌ గాంధారం”, “కోమల్‌ మధ్యమ” , “తీవ్ర నిషాధం” స్వరాలు ఉపయోగించటం లాంటి ప్రయోగాలు చెప్పుకోతగ్గవి.
             ఇంతకు ముందు చెప్పినట్టు, కర్ణాటక శాస్త్రీయ సంగీతంలోని “మోహనం” రాగానికి ” దగ్గరగా” ఉండే రాగం హిందూస్తానీ శాస్త్రీయ సంగీతంలోని “భూప్‌” రాగం. “దగ్గరగా” అనటానికి కారణం ఉంది. స్వరాల దృష్య్టా ఈ రెండు రాగాలూ ఒకే రకంగా కనిపించినా, ఒకే రకంగా వినిపించవు! ఈ రెండు రాగాలూ తీసుకు వచ్చే అనుభూతులు వేరు వేరు. సాధన, అనుభవం ఉన్న వ్యక్తులకు ఈ రెండు రాగాల మధ్య ఉన్న పోలికలు, తేడాలు తెలుస్తాయి.అది మరీ అంత కష్టమైన పని కాదు. శ్రద్ధగా ఈ రెండు రాగాలలో కొన్ని పాటల్ని వింటే ఆ తేడాలను కనిపెట్టవచ్చు. “భూప్‌” రాగంలో స్వరపరచి, హిందీ సినిమా ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ పాడిన ” జ్యోతి కలశ.. కలశ చలకే” అన్న పాట, ఘంటసాల చక్రధారి సినిమా కోసం పాడిన ” ఘనా ఘన సుందరా..” అన్న పాట విని, ఇక్కడ ఉదహరించిన మోహనం లోని పాటలతో పోలిస్తే, ఈ “తేడా” ఏమిటో అర్ధమవుతుంది. గమ్మత్తుగా మోహనం రాగం స్వరాలు మాత్రమే ఉపయోగించే ఇంకొక హిందూస్తానీ రాగం “దేశ్‌కార్‌”. చిరంజీవులు సినిమా కోసం ఘంటసాల స్వరం ఇచ్చిన “తెల్ల వార వచ్చే తెలియక నా స్వామి..” అన్న పాట “దేశ్‌కార్‌” రాగం లోనిదే! మోహనం రాగానికి దగ్గరగా ఉండే ఈ “దేశ్‌కార్‌” రాగం సూర్యోదయ కాలంలో పాడుకొనే రాగం. షాహిద్‌ పర్వేజ్‌ సితార్‌పై పలికించిన ఈ దేశ్‌కార్‌ రాగం వినండి. చాలా చోట్ల మోహనం రాగం లాగా అనిపించే ఈ దేశ్‌కార్‌ రాగానికి వాది “ద” సంవాది ” గ”. ఇందుకు పూర్తిగా వ్యతిరేకమైన వాదిసంవాదులు “భూప్‌” రాగానికి ఉన్నాయి. “భూప్‌” రాగానికి వాది ” గ”, సంవాది “ద”.
పైన చెప్పినట్లు, మోహన రాగంలో అన్యస్వరాలను అందంగా ఉపయోగించటం మన పాత సినిమా సంగీత దర్శకులు కూడా చేసారు. అప్పుచేసి పప్పు కూడు సినిమా కోసం సాలూరు రాజేస్వరరావు స్వర కల్పన చేసిన ” ఎచటనుండి వీచెనో ఈ చల్లని గాలి..” అన్న పాటలో ” వీచెనో..” అన్న పదం తరువాత సాగే గమకంలో మోహన రాగంలో నిషిద్ధమైన “నిషాధం” పడుతుంది. అయినా, పాట వినసొంపుగా ఉంది. అలాగే శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా కోసం పెండ్యాల వెంకటేశ్వరరావు స్వరం ఇచ్చిన “మనసు పరిమళించెనే..” అన్న పాట మొదలవుతూనే వినిపించే స్వరాల్లో తీవ్ర నిషాధం ఉపయోగించటం జరిగింది. ఇలాంటి ఇంకో ఉదాహరణ గుండమ్మ కధ సినిమాలోని “మౌనముగా నీ మనసు పాడినా..” అన్న మోహనం రాగంలోని పాటలో కూడా ” నీ మనసు నాదనుకొంటిలే..” అన్నప్పుడు “మనసు” లో నిషాధం పలికించాడు ఘంటసాల.
              “మదిలోని మధుర భావం పలికేను మోహన రాగం..” అనే యుగళగీతం జయసింహ సినిమా కోసం టి. వి. రాజు స్వరకల్పన చెస్తే ఘంటసాల, బాల సరస్వతులు పాడారు. (ఏదైనా సినిమా పాటలోని సాహిత్యంలో ఒక రాగం పేరు కపడితే, ఆ పాట ఆ సాహిత్యంలో కనిపించే రాగంలో స్వరకల్పన చేయబడిందని చెప్పకండి! చిక్కుల్లో పడగలరు. ఉదాహరణకు, ” మోహనరూపా గోపాలా..” అన్న పాట చెంచులక్ష్మి సినిమాకోసం స్వరం చేయబడింది మోహనం రాగంలో కాదు, ” హిందోళం” రాగంలో!) ఈ పాటలో గమనించవలసిన అంశాలు రెండు. మొదటిది, అద్భుతంగా వీణపై పలికించిన శుద్ధ కర్ణాటక పరమైన మోహనం రాగస్వరాలు మనం విని ఆనందించేలోపే చక్కగా హవాయిన్‌ గిటార్‌ వినిపిస్తూ వీణ వినమరుగవుతుంది.చరణాల మధ్య ఉన్న సంగీతంలో కూడా మహాద్భుతంగా గిటార్‌ని ఉపయోగించుకోవడం గమనించతగ్గది. రెండవది, గాయని, గాయకుల్లోని శ్రుతులు. సహజంగా లలితంగా పాడే శ్రీమతి రావు బాలసరస్వతీ దేవి గొంతు,పై శ్రుతులకన్న క్రింది శ్రుతుల్లో ఎక్కువ మాధుర్యంగా ఉంటుంది. గాయకుడుగా ఘంటసాల ఇందుకు పూర్తిగా విరుద్ధం! దీనికి కొంత కారణం సహజంగా మగవారి శ్రుతి, ఆడవారి శ్రుతి కన్నా హెచ్చుగా ఉండటం.( ఈ నాటి ప్రముఖ గాయని “చిత్ర” శ్రుతి సహజంగా హెచ్చుగా ఉండటంవల్ల, ఈ నాటి సంగీతానికి తగ్గట్టు చాలా సునాయాసంగా ఎక్కువ యుగళ గీతాలు పాడగలుగు తున్నారు.) అందువల్ల ఈ యుగళ గీతానికి సరి అయిన శ్రుతికోసం,ఘంటసాల చేత తక్కువ శ్రుతిలో పాడించటం జరిగింది.ఈ రకంగా పాడించడం వల్ల పాటకు ఒక కొత్త అందం వచ్చింది. ఇదే సినిమాలో టి.వి. రాజు, ఘంటసాల, లీలలతో పాడించిన “ఈనాటి ఈహాయి..” అన్న పాట మోహనం రాగంలో పాడించటం మరో గొప్ప విషయం. ఈ రెండు పాటల సంగీతంలోని వైవిధ్యాలను గమనించండి. అవటానికి మళ్ళీ ఈ రెండు పాటలూ ప్రణయ గీతాలే!
(Source : www.eemaata.com)