Tuesday, February 26, 2013

నమ్మకద్రోహం (ఈసప్ కథలు)

ఒక గద్దకు, నక్కకు స్నేహం కుదిరింది. గద్ద చెట్టుమీద గూడు కట్టుకుని ఉంటే, ఆ చెట్టు కింద నివాసం ఏర్పరచుకుని జీవిస్తోంది నక్క.

కొన్నాళ్లకు నక్కకు పిల్ల పుట్టింది. అది ఎంతో సంతోషంగా గద్దకు తన బిడ్డను చూపించింది. అయితే ఓరోజు నక్క ఆహారం తెచ్చుకోవడానికి బయటికి వెళ్లింది. అది అదనుగా చూసుకుని, గద్ద నక్కపిల్లను ఎత్తుకుపోయింది. ఆ పిల్లను చంపేసి తన పిల్లలకు పెట్టి, తనూ తింది.

కాసేపటికి తిరిగి వచ్చిన నక్కకు పిల్ల కనిపించలేదు. గద్దను అడిగితే తనకూ తెలియదంది. కానీ గద్ద చేసిన ద్రోహాన్ని నక్క కనిపెట్టింది. అయినా ఏమీ చేయలేక మౌనంగా రోదించింది.

తర్వాతి రోజు తన గూటికి దగ్గర్లో కొంతమంది వ్యక్తులు ఒక గొర్రెను బలిచ్చి, దాన్ని కాల్చడం కనిపించింది గద్దకు. ఎలాగైనా ఒక ముక్కను ఎత్తుకుపోవాలని అనుకుంది. మెల్లగా వెళ్లి కాస్తంత మాంసాన్ని నోట కరచుకుని పెకై గిరింది. వాళ్లెక్కడ పట్టుకుంటారోనని భయపడి గబగబా గూటికి చేరుకుంది.

అయితే మాంసాన్ని దొంగిలించే ప్రయత్నంలో దాని తోకలోని ఒక ఈకకు అంటుకున్న నిప్పు, ఎండుపుల్లలతో నిర్మించిన గూటికి అంటుకుంది. మంటలకు తాళలేక ఇంకా రెక్కలు రాని గద్దపిల్లలు కింద పడిపోయాయి. అది చూసిన నక్క వాటిని తినేసింది. కళ్లముందే పిల్లలు చనిపోవడం చూసిన గద్ద పెద్దగా ఏడ్చింది. ఆ రోజు తాను నక్కకు ద్రోహం చేయకుండా ఉండివుంటే, ఈరోజు అది తన పిల్లల్ని కాపాడేది కదా అని తనలో తానే కుమిలిపోయింది.

నీతి: నమ్మినవాళ్లను మనం బాధపెడితే, చివరకు మనకూ బాధే మిగులుతుంది.

0 comments:

Post a Comment